24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

ఓం జ్ఞాన నేత్ర ప్రదాయకాయ నమః


మనందరికీ మనం శివునినుండే వచ్చామనీ తెలుసు, అలాగే మనలోనే ఆ శివుడున్నాడనీ తెలుసు. అయినా అయన శివుడిగానే ఉన్నాడు, మనం మాత్రం చివరికి శవాలుగా మిగిలిపోతున్నాం. ఏమిటి దీనికి కారణం? ఆ శివునిలో ఉన్నది, మనలో లేనిది ఏమిటి? అని ఆలోచిస్తే ఆయనకు మనకన్నా ఎక్కువగా ఉన్నది మూడవ కన్ను. అదే జ్ఞాన నేత్రం. ఆ కన్ను ఒక్కసారి తెరుచుకుందంటే ఇక జాతి, నీతి, కులం, గోత్రం, నామం, రూపం, గుణం, దోషం, దేశం, కాలం ఇలా మనం పెట్టుకున్న విశేషనాలన్నీ కాలి బూడిద అయిపోయి, విభూతి(భగవంతుని వైభవం) ఒక్కటే మిగులుతుంది.

నశ్వరమైన ఈ దేహమే నేనని భావించేవాడికి మృత్యువుకానీ సర్వవ్యాపకమై నిత్యమైన ఆత్మవస్తువును నేనని తెలుసుకున్నవాడికి ఇక చావు పుట్టుకలెక్కడివి? అటువంటి జ్ఞాన నేత్రాన్ని మనకు ప్రసాదించటానికి స్వయంగా మళ్ళీ ఆ సదాశివుడే సద్గురు రూపం ధరించి మాటిమాటికీ మన మధ్యకు వచ్చి, మనతోనే ఉండి, మనలోనే ఉన్న శివుడిని దర్శింపచేసి జగత్తంతా శివమయమే అన్న ఆరూఢమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు.

మనకు కనిపించే ఈ ప్రపంచంలో మనం అగ్నిని, జలాన్ని అన్నింటికంటే పవిత్రమైనవిగా భావిస్తాం. ఎటువంటి మలినాలనైనా అగ్ని కాల్చివేసి స్వచ్ఛమైన విభూతిగా మార్చివేస్తుంది. అలాగే మురికి కాలువలో నీళ్ళైనా గంగానదిలో కలవగానే మనం పవిత్రంగా శిరస్సున జల్లుకుంటాం. కానీ భగవద్గీతలో స్వామి "నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే" - జ్ఞానంతో సరిపోల్చగల పవిత్ర వస్తువు మరేదీ లేదు అని స్పష్టంగా చెప్పారు. అట్టి జ్ఞానాన్ని ప్రసాదించే పరశివ స్వరూపులైన గురువులకు వందనం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి