10, ఆగస్టు 2017, గురువారం

వ్యష్టి-సమష్టి

మనం ఎప్పుడూ నేను, నాది, నా ఇల్లు, నా కుటుంబం, నా కులం, నా ఊరు, నా జాతి ఇలా ప్రతి దాంట్లో నాది, పరాయిది అని భావిస్తూ ఉంటాం. దీనినే వ్యష్టి భావన అంటారు. ఈ వ్యష్టి భావనలో ఉన్నంత కాలం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, అలాగే మంచి చెడులు, ఇష్టాయిష్టాలు, రాగద్వేషాలు ఇలాంటివన్నీ ఉంటాయి. అలా కాక ఈ జగత్తంతా ఒక్కటే అనే భావన దృఢమైన నాడు ఈ వ్యత్యాసాలన్నీ అంతరించిపోతాయి.

ఒక ఉదాహరణ చూద్దాం. మీరు ఎవరైనా పెద్దల దగ్గరకు వెళ్ళి "అయ్యా! నేను నుదుటన విభూతి ధరించాలి అనుకుంటున్నాను" అన్నారనుకోండి, "అయ్యో! తప్పకుండా ధరించు నాయనా. అది ఎంతో శుభప్రదం" అంటారు. అదే మీరు "అయ్యా! నేను విభూతి నా కాలికి రాసుకోవచ్చా?" అని అడిగారనుకోండి, "బుద్ధుందా? లేదా? పరమ పవిత్రమైన విభూతిని అలా అవమానిస్తావా?" అని తిడతారు. ఎందుకంటే ఇక్కడ ఇంద్రియాల పట్ల వ్యష్టి భావన ఉంది కనుక ఒక ఇంద్రియం ఉన్నతమైనది మరొకటి నీచమైనది అనే భేదాలు ఉన్నాయి. అదే మీరు "అయ్యా! నేను నా ఒళ్ళంతా విభూతి పూసుకోవాలనుకుంటున్నాను" అన్నారనుకోండి, "భేషుగ్గా పూసుకో నాయనా! సాక్షాత్తూ పరమశివునిలా ప్రకాశిస్తావు" అంటారు. మరి ఈ ఒళ్ళంతాలో తల, పాదాలు, ఇంకా మధ్యలోని అన్ని అంగాలూ, మనం పైకి చెప్పుకోటానికి సిగ్గుపడే వాటితో సహా, ఉంటాయి కదా. కానీ ఇక్కడ సమష్టి భావన ఉండటంచేత ఆ భేదాలన్నీ అంతరించిపోయి అది తప్పుగా తోచలేదు.

మరో ఉదాహరణ చూద్దాం. మీరు గుడిలోకి వెళ్లి దేవుడికి శిరస్సుతోనో, చేతులతోనో నమస్కరించారనుకోండి, చూసిన వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషిస్తారు. అదే మీరు పాదాలతో నమస్కరిస్తామన్నారనుకోండి విన్నవాళ్ళు మీ పైకి చెప్పులు తీస్తారు. కానీ మరి సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు మనం పాదాలతో కూడా భగవంతునికి నమస్కరిస్తున్నాం. ఎందుకంటే "ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామో అష్టాంగముచ్యతే". ఇదే వ్యష్టి భావనకు సమష్టి భావనకు ఉన్న తేడా.

3, జులై 2017, సోమవారం

నొప్పింపక-తానొవ్వక

మనం చాలామందిని చూస్తూ ఉంటాం - ఇతరులను ఎట్టి పరిస్థితులలోనూ కష్టపెట్ట కూడదని తాము మాత్రం వారివలన చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ లోకంలో అలా బ్రతకటం చాలా కష్టం. మానవుడు సంఘజీవి. మనందరం పరస్పర ఆధారితులం. అందుకే ఇతరులను కష్టపెట్టకపోవటం ఎంత ముఖ్యమో మనం కష్టపడకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం. అందుకే సుమతీశతకంలో "పరులను నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ" అని చెప్పబడింది. అలాగే భగవద్గీతలో కూడా భక్తునికి ఉండవలసిన లక్షణాలలో "యస్మాన్నోద్విజతే లోకాః లోకాన్నోద్విజతేచయః" - లోకాన్ని కష్టపెట్టకుండా, లోకం వలన తాను కష్టపడకుండా ఉండటం ఒక లక్షణంగా చెప్పబడింది.

వెనకటికి ఒక ఊరిలో ఒక సాధువు ఆథ్యాత్మిక ఉపన్యాసం చేస్తూ అహింస గురించి ప్రముఖంగా ప్రస్తావించి అందరిలో పరమాత్ముడు ఉంటాడు కనుక ఎవరినీ హింసించకుండా ఉండటం ఎంత ముఖ్యమో చెప్పారుట. ఆయన అక్కడనుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక పెద్ద బలిష్టమైన సర్పం ఆయనకు ఎదురుపడి, "స్వామీ మీరు ఎవరినీ హింసించకూడదు అని చెప్పారు కదా, నిజంగా అదే సరైన పనా?" అని అడిగింది. అప్పుడు ఆ స్వామి "అవును. ఇకనుంచి నువ్వు కూడా ఎవరినీ కరవకుండా ఉండగలవా?" అని ప్రశ్నిస్తే ఆ సర్పం అందుకు అంగీకారం తెలిపింది. ఆ సర్పాన్ని ఆశీర్వదించి ఆ స్వామి అక్కడనుండి వెళ్ళిపోయారు.

అప్పటినుండి ఆ సర్పం ఎవరినీ కరవటం మానేసింది. ఇది గమనించిన ఊరివారు దానికి భయపడటం మానేసి ఎదురు దానినే రాళ్ళతో కొట్టటం, రకరకాలుగా హింసించటం మొదలుపెట్టారు. అయినా అది స్వామికి ఇచ్చిన మాటకు కట్టుపడి ఎవరికీ ఎదురు తిరగకుండా అలాగే బాధలను భరిస్తోంది. కొన్నాళ్ళకు ఆ స్వామి మళ్ళీ అదే ఊరిగుండా వెళ్ళడం తటస్థించింది. అప్పటికి చిక్కి శల్యమై వళ్ళంతా గాయాలతో ఉన్న ఆ సర్పాన్ని చూసి స్వామి మనసు ద్రవించింది. దానిని దగ్గరకు పిలిచి "ఎందుకు నీకీ దురవస్థ?" అని కరుణ నిండిన హృదయంతో ప్రశ్నించారు. అందుకు ఆ సర్పం "స్వామీ! మీకిచ్చిన మాట ప్రకారం నేను ఎవరినీ కరవటం లేదు. అందుకే నాకీ దురవస్థ" అని సమాధానమిచ్చింది. అప్పుడు ఆ స్వామి "నేను నిన్ను కరవద్దన్నాను కానీ బుస కొట్టవద్దని చెప్పలేదు కదా. ఎదుటివారిని హింసించకపోవటం ఎంత ముఖ్యమో మనలను మనం కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే వారిలో ఉన్న పరమాత్ముడే నీలో కూడా ఉన్నాడు కదా!" అని సమాధానమిచ్చారు. అప్పటినుండి ఆ సర్పం ఎవరైనా తన మీదకు రాగానే బుసకొట్టి వారినుండి తనను తాను రక్షించుకోవటం మొదలుపెట్టింది.

30, మే 2017, మంగళవారం

వైరాగ్యం

మనకు సాధారణంగా ఇష్టమైన వస్తువులు చూస్తే రాగం, అలాగే ఇష్టం లేని వాటిపై ద్వేషం కలుగుతూ ఉంటుంది. అయితే ఏదైనా కష్టం కలిగినప్పుడో, చూసినప్పుడో, మంచి మాటలు విన్నప్పుడో క్షణికావేశంలో వైరాగ్యం కలుగుతూ ఉంటుంది. దీనినే మన పెద్దలు ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం అన్నారు. ఆయా సందర్భాలు దాటిపోగానే మళ్ళీ మన రాగద్వేషాలు మామూలే.

అయితే మనందరికీ సంతృప్తితో కూడిన వైరాగ్యం కలిగేది ఒక్క ఆహారం విషయంలో మాత్రమే. మనిషికి ఇతర పదార్థాలు ఎన్ని యిచ్చినా ఇంకా కావాలనే కోరుకుంటాడు కానీ కడుపు నిండిన తరువాత ఆహారాన్ని మాత్రం ఇక కోరుకోడు, అది ఎంత ఇష్టమైన పదార్థమైనా సరే.

ఎందుకంటే ఇతర పదార్థాలు ఎన్ని పొందినా అవన్నీ మనకు భిన్నంగానే ఉంటున్నాయి. అదే ఆహారమైతే మనలో ప్రవేశించి మన స్వరూపాన్ని పొందుతోంది. అందుకే ఆ తృప్తి, ఆ వైరాగ్యం. తిన్న ఆహారం తన పని పూర్తి చేసుకుని మళ్లీ మననుంచి భిన్నత్వాన్ని పొందితే కానీ మనకు మళ్లీ దానిమీద కోరిక కలుగదు.

అలాగే ఈ కనిపించే సృష్టి అంతా మన స్వరూపమే, మనకు భిన్నమైనది ఏదీ లేదు - "నీవు చూచునదెల్ల నీవయేయను తత్త్వమసి వాక్యం" మనకు ఆరూఢ జ్ఞానమైనప్పుడు మనకు శాశ్వతమైన సంతృప్తి, అన్నిటి పట్ల వైరాగ్యం కలుగుతాయి. ఆ జ్ఞానాన్ని పొందేవరకు కనీసం మనకంటే భిన్నంగా ఏదీ లేదనే విషయాన్ని మాటిమాటికీ గుర్తు చేసుకుంటూ ఉంటే వైరాగ్యం పొందటం సులభమవుతుంది.

11, ఏప్రిల్ 2017, మంగళవారం

దేహము - జీవుడు - ఆత్మ

సీతారాములిద్దరూ హనుమంతులవారికి తమ నిజ తత్వాన్ని సవిస్తరంగా తెలియజేసిన తరువాత శ్రీరాముడు పరీక్షగా "హనుమా! చెప్పు, నీవెవరు?" అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు "దేహబుద్ధ్యా తవ దాసోహం, జీవబుద్ధ్యా త్వదంశకః, ఆత్మబుద్ధ్యా త్వమేవాహం" అని సమాధానం చెప్పాడు. అసలు ఈ మూడూ ఏమిటో, వాటి మధ్య వ్యత్యాసం ఏమిటో చూద్దాం.

పంచభూతాలతో నిర్మితమై మన కంటికి కనిపిస్తూ, ఇతర జ్ఞానేంద్రియాలతో అనుభూతమవుతూ ఉండే ఈ స్థూల శరీరమే దేహం. ఇక మన ఆలోచనలు, సంకల్పాలు, జ్ఞాపకాలు, కోరికలు, కర్మలు, వాసనల సమాహారమే జీవుడు. విశ్వవ్యాపకమై తాను కదలక సమస్త సృష్టిని కదిలిస్తూ ఉండే చైతన్యమే ఆత్మ.

సాధారణంగా మనం 'నేను' అని ఈ దేహాన్ని సూచిస్తూ మాట్లాడుతాం. అదే దేహబుద్ధి. ఈ దేహం నేను అనుకున్నంత కాలమూ మనం దాసులమే, రాముడు ప్రభువే. అలా కాక, ఈ దేహంలో సూక్ష్మరూపంలో ఉంటూ ఈ దేహం చేసే క్రియలన్నింటికీ ఆధారభూతమై వాటిని కర్మలుగా వాసనలుగా అంటించుకునే జీవుడు నేను అని భావించినపుడు ఆ జీవుడు దేవుడినుంచే వచ్చాడు కాబట్టి "నేను నీ అంశను" అనగలుగుతాం. ఆ జీవబుద్ధిని కూడా దాటి సర్వేసర్వత్రా నిండియున్న ఆత్మను నేను అని గుర్తించిననాడు "త్వమేవాహం" అనే స్థితికి చేరుతాం.

ఇంకా కొంచెం లోతుగా వెళితే - మనం ఒక బంగారం కొట్టుకి వెళ్ళాం అనుకోండి. అక్కడున్న నగలన్నీ చూస్తూ అందులో ఏవి కంటికి అందంగా కనిపిస్తున్నాయి, ఏవి మన వొంటిపై నప్పుతాయి అని చూస్తాం. అదే ఆ కొట్టు యజమాని మాత్రం ఏ నగ ఎంత బరువుంది, అది అమ్మితే తనకు ఎంత లాభం వస్తుంది అని మాత్రమే చూస్తాడు. అతనికి నగల అందం గురించి పట్టదు. అతనికి ఆ నగలన్నీ బంగారంలాగే కనిపిస్తాయి. ఇదే దేహబుద్ధికి జీవబుద్ధికి తేడా. అలాగే మనం రంగురంగుల గ్లాసుల్లో పాలు పోసి టేబుల్ మీద పెట్టామనుకోండి - ఇంట్లో చిన్న పిల్లలు "నాకు ఈ రంగు గ్లాసు కావాలంటే, నాకు ఆ రంగు గ్లాసు కావాలని" కొట్టుకుంటారు. అదే పెద్దవాళ్ళు గ్లాసుది ఏ రంగైనా లోపలి పాలు ఒకటే కదా అనే భావనలోనే ఉంటారు.

మనకు దేహబుద్ధి పోనంతకాలం ఇతరులను కూడా ఆ బుద్ధితోనే చూస్తాం. అందుకే ఒక కొత్త మనిషిని చూడగానే అతని ఆకారాన్ని బట్టో, వేషభాషలను బట్టో, రంగుని బట్టో ఠక్కున ఒక అంచనాకి వచ్చేస్తాం. అది ఎంత తప్పో వారితో కొంతకాలం గడిపితే కానీ తెలియదు. అదే దేహబుద్ధిని దాటి జీవబుద్దిని అందుకున్నప్పుడు మనం ఈ పైపై ఆకారవికారాలకు మోసపోక ప్రతి జీవినీ వారి వారి మస్తత్వాలను బట్టి, గుణగణాలను బట్టి మాత్రమే అంచనా వేస్తాం. నగలు ఎన్ని రూపాలలో ఉన్నా వాటిని చేసిన బంగారం నాణ్యత ముఖ్యమైనట్లు, అలాగే గ్లాసులు ఎన్ని రంగుల్లో ఉన్నా వాటిలోని పాల రుచి ముఖ్యమైనట్లు పైకి కనపడే దేహాలు ఎలా ఉన్నా వాటిలోని జీవుల సంస్కారం ముఖ్యమని గుర్తిస్తాం.

అయితే దీనిని కూడా దాటిన మహాత్ములు సర్వం ఆత్మమయంగా గుర్తించి తమకూ, చుట్టూ ఉన్న ప్రపంచానికీ ఏమాత్రం భేదం లేదనే ఎఱుకను కలిగిఉంటారు. వారికి కనీసం గ్లాసులో ఉన్నవి పాలో, నీళ్ళో, విషమో అనే భేదదృష్టి కూడా ఉండదు. అలాగే తాము ధరించినవి బంగారు నగలో, ఇత్తడి నగలో, చిరిగిన గుడ్డలో అనే దృష్టి కూడా ఉండదు. ఎదుటి వ్యక్తి ఆకారవికారాలు గానీ, ఉచ్ఛనీచ సంస్కారాలు కానీ వారిపట్ల ఎటువంటి ప్రభావమూ చూపలేవు. వారు సదా తమలోనే సర్వప్రపంచాన్నీ, అలాగే సర్వప్రపంచంలోనూ తమనీ దర్శిస్తూ ఉంటారు. అదే ఆత్మ దృష్టి, అద్వైత దృష్టి.

అయితే ఎంతటి అద్వైతాన్ని సాధించినా గురుదేవుల సన్నిధిలో మాత్రం ఎప్పుడూ మనని మనం దాసుడిగానే భావించాలి. "నాద్వైతం గురుసన్నిధౌ". అందుకే ఒక కవిగారు హనుమంతుని భక్తిని వర్ణిస్తూ "కనులనిండా ఇనవంశ సోముడు కదలాడుచుండినా ఎడదలోన శ్రీరఘురాముడు నడయాడుచుండినా తనివి తీరక తృప్తి కలుగక ఎదుట చూడాలని పదముల వ్రాలాలని, వేచి నిలిచేవా ఎదురు కాచి కొలిచేవా" అని కీర్తించారు.

24, ఫిబ్రవరి 2017, శుక్రవారం

ఓం జ్ఞాన నేత్ర ప్రదాయకాయ నమః


మనందరికీ మనం శివునినుండే వచ్చామనీ తెలుసు, అలాగే మనలోనే ఆ శివుడున్నాడనీ తెలుసు. అయినా అయన శివుడిగానే ఉన్నాడు, మనం మాత్రం చివరికి శవాలుగా మిగిలిపోతున్నాం. ఏమిటి దీనికి కారణం? ఆ శివునిలో ఉన్నది, మనలో లేనిది ఏమిటి? అని ఆలోచిస్తే ఆయనకు మనకన్నా ఎక్కువగా ఉన్నది మూడవ కన్ను. అదే జ్ఞాన నేత్రం. ఆ కన్ను ఒక్కసారి తెరుచుకుందంటే ఇక జాతి, నీతి, కులం, గోత్రం, నామం, రూపం, గుణం, దోషం, దేశం, కాలం ఇలా మనం పెట్టుకున్న విశేషనాలన్నీ కాలి బూడిద అయిపోయి, విభూతి(భగవంతుని వైభవం) ఒక్కటే మిగులుతుంది.

నశ్వరమైన ఈ దేహమే నేనని భావించేవాడికి మృత్యువుకానీ సర్వవ్యాపకమై నిత్యమైన ఆత్మవస్తువును నేనని తెలుసుకున్నవాడికి ఇక చావు పుట్టుకలెక్కడివి? అటువంటి జ్ఞాన నేత్రాన్ని మనకు ప్రసాదించటానికి స్వయంగా మళ్ళీ ఆ సదాశివుడే సద్గురు రూపం ధరించి మాటిమాటికీ మన మధ్యకు వచ్చి, మనతోనే ఉండి, మనలోనే ఉన్న శివుడిని దర్శింపచేసి జగత్తంతా శివమయమే అన్న ఆరూఢమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తారు.

మనకు కనిపించే ఈ ప్రపంచంలో మనం అగ్నిని, జలాన్ని అన్నింటికంటే పవిత్రమైనవిగా భావిస్తాం. ఎటువంటి మలినాలనైనా అగ్ని కాల్చివేసి స్వచ్ఛమైన విభూతిగా మార్చివేస్తుంది. అలాగే మురికి కాలువలో నీళ్ళైనా గంగానదిలో కలవగానే మనం పవిత్రంగా శిరస్సున జల్లుకుంటాం. కానీ భగవద్గీతలో స్వామి "నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే" - జ్ఞానంతో సరిపోల్చగల పవిత్ర వస్తువు మరేదీ లేదు అని స్పష్టంగా చెప్పారు. అట్టి జ్ఞానాన్ని ప్రసాదించే పరశివ స్వరూపులైన గురువులకు వందనం.