5, అక్టోబర్ 2016, బుధవారం

చిదగ్ని కుండ సంభూతా

చిత్ అంటే జ్ఞానం. జగన్మాత జ్ఞానాగ్ని కుండంలోనుండి ఆవిర్భవించింది అని ఈ నామం చెబుతోంది. అయితే ఈ అగ్నికుండం/యజ్ఞకుండం ఎప్పుడో ఎక్కడో చరిత్రలో లేదు. మన మనస్సనే యజ్ఞకుండంలో ధ్యానాగ్నిని రగిల్చి అందులో నిరంతర సాధన ద్వారా శబ్ద స్పర్శ రూప రస గంధాలనే పంచ తన్మాత్రలను, పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను, పంచ వాయువులను, అంతఃకరణ చతుష్టయాన్ని, మూడు గుణాలను, మూడు అవస్థలను, మూడు మలాలను, మూడు వాసనలను, మూడు ఈషణలను, మూడు తాపాలను, మూడు దేహాలను, అహంకార మమకారాలను, సుఖదుఃఖాలను, రాగద్వేషాలను హవిస్సులుగా అర్పిస్తూ యజ్ఞం చేస్తూ ఉంటే ఆ ధ్యానాగ్నియే జ్ఞానాగ్నిగా పరివర్తన చెందుతుంది.

అప్పుడు మనలోనే ఆ చిదగ్ని కుండంనుండి అష్టాదశ భుజాలతో, సర్వాభరణ భూషితయై కోటి సూర్యుల కాంతిని కూడా తలదన్నే కాంతితో జగన్మాత ఆవిర్భావం జరుగుతుంది. ఇది సాధించిన మహాత్ములు నిరంతర ఆత్మజ్యోతితో ప్రకాశిస్తూ నలుదిశల తమ ప్రసన్న రోచస్సులను వెదజల్లుతూ ఉంటారు. అట్టి మహాత్ముల దర్శనమాత్రం చేతనే మన సకల తాపాలు నశించి అంతులేని ప్రశాంతతతో మన హృదయం నిండిపోతుంది.

ఇక అలా జగన్మాతను తమలోనే సాక్షాత్కరింప చేసుకున్న మహాత్ములు మనలో ఉన్న అజ్ఞానమనే మహిషాసురుని సమూలంగా నాశనం చేయగలరనటంలో సందేహమేముంది? అందుకే గురుస్సాక్షాత్ పరబ్రహ్మ అని మన ఆర్ష ధర్మం బోధిస్తోంది. సర్వ దేవతామూర్తుల శక్తులన్నీ కలిసి జగన్మాతగా ఎలా అయితే రూపు దాల్చాయో అలాగే గురువు కూడా సర్వదేవతా స్వరూపుడు. గురువుకి జగన్మాతకి భేదం లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి