10, అక్టోబర్ 2016, సోమవారం

తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా

ముందుగా తాపత్రయం అంటే ఏమిటో చూద్దాం. ప్రతి మనిషికీ మూడు రకాల తాపాలు ఉంటాయని వేదాంతంలో చెప్పబడింది. అందులో మొదటిది ఆదిభౌతిక తాపం - అంటే ఇతర మనుష్యుల వలనగాని, జంతువుల వలనగాని, లేదా మరే ఇతర భౌతిక పదార్ధాల వలనగాని కలిగే బాధలు. రెండవది ఆదిదైవిక తాపం - అంటే దైవికంగా సంభవించే వరదలు, భూకంపాలు మొదలైన వాటి వలన కలిగే బాధలు. ఇక మూడవది ఆధ్యాత్మిక తాపం - అంటే మన మనస్సు మనను పెట్టే బాధలు - భయాలు, సంకోచాలు, మానసిక రోగాలు, దుస్స్వప్నాలు మొదలైనవి.

ఇటువంటి మూడు తాపాలతోను బాధపడే మనుష్యుల హృదయాలకు ఆహ్లాదకరమైన చల్లదనాన్ని ఇచ్చి స్వస్థత కలిగించే చంద్రునివంటిది జగన్మాత. ఆ జగన్మాతను హృదయంలో నింపుకున్న భక్తులకు ఇతర జీవులుగాని మనవులుగానీ ఎటువంటి కష్టాన్ని కలిగించలేరని మనకు అనేక భక్తుల చరిత్రలలో నిరూపితమైనదే కదా! ఇక నిత్యం ఆత్మానందంలో ఓలలాడే అటువంటి భక్తులు ప్రకృతి వైపరీత్యాలను అసలు గుర్తించనే గుర్తించరు. మరి మనస్సంతా జగన్మాత నిండిపోయాక ఇంక మానసిక రోగాలకుగానీ, భయ సంకోచాలకుగానీ చోటెక్కడ ఉంటుంది?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి