2, అక్టోబర్ 2016, ఆదివారం

ఆబ్రహ్మ కీట జననీ

ఈ సృష్టిలో ఒక చిన్న చీమ మొదలు బ్రహ్మదేవుని వరకు మనందరం ఒక తల్లి బిడ్డలమే. ఆ తల్లే జగన్మాత. సృష్టిలోని ప్రతి జీవజాతిలోనూ మాతృమూర్తులు తమ పిల్లలు సొంత కాళ్ళపై నిలబడే వరకు ఎప్పుడు ఏది కావాలో క్రమం తప్పకుండా అందజేస్తూ అనుక్షణం కంటికి రెప్పలా తమ సంతానాన్ని కాపాడుకుంటూ ఉంటాయి.

అయితే ఈ తల్లులకు ఎప్పుడైనా నిద్ర, ఏమరుపాటు కలుగుతాయేమో కానీ ఆ జగన్మాత మాత్రం ఎప్పటికీ ఏ ఒక్క ప్రాణినీ నిర్లక్ష్యం చేయదు. అయితే తల్లి చిన్నపిల్లల సంరక్షణలో తనకు చేదోడుగా ఉండటానికి పెద్దపిల్లలకు శిక్షణనిచ్చినట్లుగా ఆ జగన్మాత మానవులకు మిగిలిన జీవులకు లేని బుద్ధిని ప్రసాదించింది.

కానీ మనం మాత్రం ఆ బుద్ధిని సృష్టి పోషణలో ఆ తల్లికి సహకరించటానికి ఎంతవరకు ఉపయోగిస్తున్నాం? మిగిలిన జీవరాశులను మన తోబుట్టువులలా సాకటం మాట అటుంచి, మనలో మనమే జాతి నీతి కుల గోత్రాలనీ నామ రూప గుణ దోషాలనీ అడ్డుగోడలు కట్టుకొని ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటున్నాం. మన అంతులేని ఆశకు ప్రకృతి సమతౌల్యాన్ని బలి చేస్తున్నాం.

మరి తన సంతానమంతా ఇలా పరస్పరం కలహించుకుంటూ, కాపాడవలసిన అగ్రజులే తమ అనుజులను కాటేస్తూ ఉంటే ఆ అమ్మలగన్నయమ్మ మనస్సు ఎంతగా క్షోభిస్తుందో ఒక్కసారి ఆలోచించుకుంటే మనలో తప్పకుండా మార్పు వస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి