24, ఆగస్టు 2016, బుధవారం

పుట్టు భోగులము మేము

మా గురుదేవులు శ్రీ బాబూజీ మహరాజ్ తరచుగా చెప్పేవారు - లక్ష్మీదేవి మహా పతివ్రత. ఎప్పుడూ తన పతిదేవుడైన శ్రీమన్నారాయణుడిని అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి మీరు ఆ నారాయణున్ని మనస్సులో నింపుకుంటే మీకు ఇహంలో కావలసినవన్నీ ఆ తల్లి చూసుకుంటుంది. ఇక పరం సంగతి నారాయణుడు చూసుకుంటాడు - అని.

ఇదే విషయాన్ని అన్నమయ్య మరింత వివరంగా పుట్టుభోగులము మేము అనే కీర్తనలో వివరించారు. మనం సాధారణంగా ఏ మహారాజునో ఆశ్రయిస్తే వారు పల్లకీలు, అందలాలు, నిత్యం మనని పొగుడుతూ తిరిగే భట్రాజులూ ఇవ్వవచ్చు. కానీ ఇవన్నీ మహాలక్ష్మీ విలాసాలే కదా? మరి ఆ తల్లి భర్తకు దాసులమైన మనకు నడమంత్రపు సిరిగల రాజులనుండి ఇవి ఆశించాల్సిన అవసరమేముంది?

పోనీ, ఆ రాజులు గ్రామాలనో, రత్నాలనో, ఏనుగులు, గుఱ్ఱాలనో ఇస్తారనుకుందాం. మరి ఇవన్నీ ప్రకృతి స్వరూపిణయైన భూమాత శరీరంలో భాగాలే కదా! ఆ తల్లికి నాధుడైన వాడిని ఆశ్రయించిన మనకి ఇవి వేరేవాళ్ళు ఇచ్చేదేమిటి?

అసలు ఈ సృష్టిలోని విశేష వస్తువులన్నీ బ్రహ్మదేవుడు తయారు చేసినవే కదా! మరి ఆ బ్రహ్మకే తండ్రియైన వేంకటేశ్వరుడు మనవాడై, మనకు ఏ సమయానికి ఏది కావాలో ప్రేమతో అందిస్తున్నప్పుడు ఇక మనం అన్యులనుండి పొందాల్సింది ఏముంటుంది? అని అన్నమయ్య ప్రశ్నిస్తున్నారు.

14, ఆగస్టు 2016, ఆదివారం

పల్లమెఱుగని నీరు

ఈ రోజు నేను కారు నడుపుతూ ఉండగా ఒక వంతెన పైనుండి యిన్ని నీళ్ళు ముందు ఉండే అద్దం మీద పడ్డాయి. ఏటవాలుగా ఉండే అద్దం మీద మామూలుగా నీళ్ళు పడితే అవి భూమ్యాకర్షణకు లోబడి క్రిందికి జారిపోవాలి కదా? కానీ కారు వేగానికి ఉత్పన్నమైన యెదురు గాలికి ఒక్క చుక్క నీరు కూడా క్రిందికి జారకుండా, మొత్తం పైకి ప్రవహించింది. 

మన మనస్సు కూడా ఆ నీరులాంటిదే. ఎప్పుడూ ప్రాపంచిక ఆకర్షణలకు లోబడి నీచ భావాల దిశగా జారిపోతూ ఉంటుంది. కానీ అదే మనస్సుకు వేగంగా మరియు నిరంతరంగా జరిగే భగవన్నామ జపాన్ని తోడు చేసినపుడు, అది ఆ ఆకర్షణకు వ్యతిరేక దిశలో, పరమాత్మకు అభిముఖంగా, ఆథ్యాత్మిక ఉన్నతి దిశగా ప్రయాణం చేయగల శక్తిని సంతరించుకుంటుంది. 

ఇక్కడ వేగంగా జపం చేయడమంటే మనం పలికే నామం మనకే అర్థమవనంత హడావిడిగా చేయడమని కాదు. నామానికి నామానికి మధ్య సంకల్పాలు దూరే సందు యివ్వకుండా అని అర్థం. మా గురుదేవులైన శ్రీబాబూజీ మహరాజ్ వారు దీనికి రెండు ఉదాహరణలు చెప్పేవారు. 

ఫ్యాను వేగంగా తిరిగినప్పుడు దాని మూడు ఱెక్కలూ కలిసిపోయి ఒక్కటిగా ఎలా గోచరిస్తాయో, అలాగే భగవన్నామం వేగంగా జపించినప్పుడు మన మూడు గుణాలూ లయమైపోయి శుద్ధసత్వ గుణంగా భాసిస్తాయి. జనరేటర్ వేగంగా తిరిగినప్పుడు విద్యుచ్ఛక్తి ఎలా ఉత్పన్నమవుతుందో, అలాగే నామజపం వలన మనలో ఆథ్యాత్మిక శక్తి ఉత్పన్నమవుతుంది.