31, మార్చి 2015, మంగళవారం

భోజనంలో రకాలు

మనం తినే భోజనంలో కూడా మన గుణాలను అనుసరించి మూడు రకాలు ఉన్నాయని భగవద్గీతలో చెప్పబడింది. అవేమిటో చూద్దాం.

సత్వగుణ ప్రధానుల భోజనం:

ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః ||

ఆయుష్షును, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంపొందింపచేసేది, రసవంతమైనది, చక్కగా మెరిసేది, చూడగానే కంటికి, ముక్కుకు, హృదయానికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే భోజనం సత్వగుణ ప్రధానులైన వారికి ఎంతో ఇష్టమైనది. ముఖ్యంగా ఏ పూటకు ఆ పూట చక్కగా వండుకొని భగవంతునికి నివేదించి తీసుకునే ఆహారం సాత్వికమైనది.

రజోగుణ ప్రధానుల భోజనం:

కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహినః |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః ||

ఇక చేదుగా, పుల్లగా ఉండేవి, అతిగా వేడి చేసేవి, ఎండినట్లు ఉండేవి (ఫ్రైడ్ రైస్ లాంటివి), ఎక్కువగా వేయించినవి, ఎక్కువగా దాహాన్ని కలిగించేవి (మసాలాలు) అయిన ఆహారాలు రజోగుణ ప్రధానులు ఇష్టంగా తింటారు. అయితే ఇవి తినేటప్పుడు ఇష్టంగా ఉన్నా ఆ తరువాత దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. ఇంతకుముందు మనం రాజసిక సుఖంలో గారెల గురించి చెప్పుకున్నాం కదా.

తమోగుణ ప్రధానుల భోజనం:

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం ||

ఇక పోతే మనం ఇదివరలో చెప్పుకున్నట్లు తమోగుణ ప్రధానులైనవారు తాము ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తమకే తెలియకుండా ఉంటారు. అందువలన వారికి సారహీనమైనవి, శక్తి అంతా పోయినవి, బూజు పట్టినవి, ఎంగిలివి, అసలు తినకూడనివి అయిన పదార్థాలు కూడా ఎంతో ఇష్టంగా ఉంటాయి. ఈ రోజులలో ఓపిక, తీరిక లేని జీవితాలతో మనం ఒకరోజు వండుకుని, ఫ్రిజ్ లో పెట్టుకుని, పది రోజులపాటు తినేవన్నీ ఇలాంటివే.

ఈ విధంగా మనలో ఉన్న గుణాలు మనం తినే ఆహారంయొక్క స్వభావాన్ని ఎలా నిర్ణయిస్తున్నాయో అలాగే మనం తినే ఆహారం కూడా మనలో ఆయా గుణాలను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది నిరూపించటానికి పెద్దలు ఒక సంఘటనను ఉదహరిస్తారు.

ఒకనాడు ఒక సన్యాసిని ఒక ఇల్లాలు తన ఇంట భోజనానికి ఆహ్వానించింది. అయితే భోజనం చేస్తున్న సమయంలో ఆ సన్యాసికి తనకు మంచినీళ్ళు పెట్టిన వెండి చెంబును తస్కరించాలనే కోరిక కలిగింది. అయన మహాత్ముడు కనుక వెంటనే గ్రహించి ఆ ఇల్లాలిని అడిగాడు "తల్లీ! ఈ మీ ఐశ్వర్యం అంతా ఎలా సంపాదించారు? నిజం చెప్పు" అని. ఇక చేసేది లేక ఆ ఇల్లాలు తాము ఆ సంపదనంతా అన్యాయంగానే సంపాదించామని ఒప్పుకుంది. "నీ ఇంట భోజనం చేయటం వల్ల సర్వసంగ పరిత్యాగినైన నాకు కూడా ఈవేళ చోరబుద్ధి కలిగింది. దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి. అలాగే ఇంకెప్పుడూ నన్ను మాత్రం భోజనానికి పిలువకండి" అని చెప్పి ఆ సన్యాసి అక్కడనుండి నిష్క్రమించాడు.



17, మార్చి 2015, మంగళవారం

గొల్ల-గుల్ల-గోవింద

సాధకుడైనవాడు భగవంతుని పొందటానికి తన మనస్సుని ఏవిధంగా మార్చుకోవాలి అనే విషయంలో మా గురుదేవులు శ్రీబాబూజీ మహారాజ్ వారు ఒక చక్కని సన్నివేశాన్ని తెలిపేవారు.

నిజానికి రాధాకృష్ణులు తత్వతః ఏకస్వరుపులైనా రాధకి కృష్ణునితో భౌతికంగా నిరంతర సాన్నిహిత్యం లభించేది కాదు. రోజులో ఏ కొద్ది సమయమో మాత్రమే ఆమె శ్రీకృష్ణునితో గడపగలిగేది. మిగిలిన గోపికలందరిదీ కూడా ఇదే పరిస్థితి. కానీ రోజులో ఒక్క క్షణం కూడా విడువకుండా, నిరంతర సాన్నిధ్యాన్ని పొందగలిగింది మాత్రం వేణువు ఒక్కటే. ఈ విషయంలో రాధాదేవికి కొంత అసూయతోపాటు, అసలు ఇంతటి భాగ్యాన్ని పొందటానికి ఆ వేణువు చేసిన సాధన ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా ఉండేది. అయితే కృష్ణుడు లేని సమయంలో ఆ వేణువును చేజిక్కించుకోవటం ఎలా?

కరుణామయుడైన గోవిందుడే ఆ అవకాశాన్ని కల్పించాడు. ఒకనాడు యమునాతీరంలో ఇసుక తిన్నెలపై శయనించినప్పుడు, రాధకోసమే అన్నట్లుగా తన చేతిలోని వేణువును జారవిడిచాడు. రాధాదేవి వెంటనే ఆ వేణువును దొరకబుచ్చుకొని ఒక పొదరిల్లు చాటుకి వెళ్ళి ఆ వేణువును ప్రశ్నించింది, "ఇలా నిరంతరం గోవిందుని సాన్నిధ్యాన్ని పొందటానికి నీవు చేసిన పుణ్యం ఏమిటని". అప్పుడు ఆ వేణువు నవ్వి ఇలా చెప్పింది. "ఓ రాధా! నేను ఎట్టి సాధనలు చేయలేదు. నాకు ఏమీ తెలియదు. నువ్వే చూస్తున్నావుగా, నాలో ఏమీ లేదు. ఒళ్ళంతా చిల్లులుగల ఒక వెదురు గొట్టాన్ని మాత్రమే. అయితే నేను ఇలా అంతా ఖాళీ చేసుకోవటమే ఆ పరమాత్మకు నన్ను దగ్గర చేసిన భాగ్యం. అంతేకాదు నిరంతరంగా ఆయన అధరామృతాన్ని గ్రోలుతూ కూడా కొంచెం కూడా నాలో దాచుకోకుండా వేణునాదంగా మార్చి విశ్వమంతటికీ పంచిపెడుతున్నాను. ఇదే నేను చేసే సాధన" అని.

అంతేకాదు, గొల్లవాళ్ళైన బృందావన వాసులందరూ ఇలాగే తమ మనసులను గుల్లగా చేసుకున్నారు. అందుకే ఆ మనసులలో గోవిందుడు ప్రవేశించి వాటిని తనకు అత్యంత ఇష్టమైన నివాసస్థానాలుగా మార్చుకున్నాడు. ఇలాగే మన మనసులను కూడా ఏ విషయాలూ లేకుండా ఖాళీగా చేసుకుంటే ఆ పరమాత్ముడు అందులో ప్రతిష్టితుడై బ్రహ్మానందంలోముంచెత్తుతాడు. అటువంటి సద్భక్తులు ఆ ఆనందాన్ని కూడా తాము దాచుకోకుండా లోకానికంతటికి పంచిపెడతారు.

11, మార్చి 2015, బుధవారం

గుణాలపై విజయం

మనం ఎవరినైనా జయించాలంటే ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వాళ్ళ బలాలేమిటో, బలహీనతలేమిటో కనిపెట్టాలి. మరి మనలోనే ఉన్నగుణాలను జయించాలంటే వాటి గురించి కూడా మనం ముందుగా తెలుసుకోవాలి కదా. భగవద్గీతలోని 14, 17 మరియు 18వ అధ్యాయాలలో గీతాచార్యుడు ఈ మూడు గుణాలయొక్క స్వభావాన్ని వివిధ ఉదాహరణల ద్వారా చక్కగా వివరించటం జరిగింది.

మనం చేసే ప్రతి పని, మనలోని ప్రతి ఆలోచన, మనకున్న అన్ని లక్షణాలు ఈ మూడు గుణాలతో ప్రభావితమై ఉంటాయి. అందుకే యజ్ఞం, దానం, తపస్సు, ధైర్యం, శ్రద్ధ, అవగాహన, ఆహారం, కర్మలు - ఇలా ప్రతి ఒక్క దాన్ని తీసుకుని అవి సత్వరజస్తమో గుణాలలో ఒక్కొక్క దానిచేత ప్రేరేపించబడినప్పుడు ఏ ఏ విధంగా ఉంటాయో చాలా వివరంగా చెప్పబడింది. వీటన్నిటినీ గమనిస్తే మనకి అన్నిట్లో ఈ గుణాలయొక్క సహజ లక్షణాలు కొంతవరకు అర్థమవుతాయి.

తమోగుణం:

తమోగుణ ప్రధానులైన వారిలో మనం ముఖ్యంగా గమనించతగిన లక్షణం తాము ఏమి చేస్తున్నామో, ఆ పనిని ఎలా చేయాలో, ఆ పని చేస్తే వచ్చే ఫలితమేమిటో ఏమీ తెలియకుండా ఏదో చేసాంలే అనే రీతిలో చేయటం, ఎదుటివారు ఏమి చెప్పినా దానిని తలక్రిందులుగా(విపరీతార్థంలో) అర్థం చేసుకోవటం. ఈ లక్షణానికి ప్రధాన కారణం అజ్ఞానం, సోమరితనం. నిజానికి ఇవి రెండూ వేరువేరని మనం అనుకుంటాం కానీ మా గురుదేవులు సోమరితనమే అజ్ఞానం అని చెప్పేవారు. 

రజోగుణం:

రజోగుణ ప్రధానులైన వారికి ఏ పని ఎలా చేయాలో బాగానే తెలుసు. విషయాలన్నీ బాగానే అర్థం అవుతూ ఉంటాయి. చేసే పనులన్నీ శ్రద్ధగా తప్పులు లేకుండా కూడా చేస్తూ ఉంటారు. కానీ వీరు చేసే ప్రతి పని వెనుక స్వార్థం దాగి ఉంటుంది. ఏదైనా ప్రతిఫలాన్నో, పుణ్యాన్నో, పేరు ప్రతిష్టలనో ఆశించి చేస్తూ ఉంటారు.

సత్వగుణం:

ఇక సత్వగుణ ప్రధానులైనవారు తాము చేసే ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చేస్తారు. కానీ ఏ పనికీ వీరు ప్రతిఫలాన్ని ఆశించరు. శాస్త్రము లేదా గురువులు, పెద్దలు నిర్దేశించిన విధంగా ఆయా కర్మలను తమ కర్తవ్యంగా భావించి నిరంతరాయంగా చేస్తూ ఉంటారు కానీ ఎప్పటికీ దీనివలన నాకేంటి అని కాని, ఫలితంలేని పనులను ఎన్నాళ్ళు చేస్తాం అని కాని ఆలోచించరు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా, కేవలం భగవంతుడు తమతో చేయిస్తున్నాడనే భావనతో, అత్యంత శ్రద్ధా భక్తులతో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. అలాగే గురువులు, పెద్దలు చెప్పిన ప్రతి విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆచరణలో పెడతారు.

కనుక మనం ముందుగా తమోగుణాన్ని జయించాలంటే సోమరితనాన్ని వదలిపెట్టి, గురువులను, పెద్దలను ఆశ్రయించి ఏ పని ఎలా చెయ్యాలో శ్రద్ధగా తెలుసుకోవాలి. మా గురుదేవులైతే ఏ వంట ఎలా చెయ్యాలి అన్న దానినుంచి ఏ పదార్థాన్ని ఎలా తినాలి అన్న దానివరకు, మొక్కలు ఎలా పెంచాలి అన్న దానినుండి, పూవులు ఎలా కోయాలి, అవి భగవంతునికి ఎలా అలంకరిచాలి అన్నదాని వరకు ఇలా జీవితంలో ప్రతి విషయంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలి - ఇలా ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా నేర్పించేవారు.

ఇలా నేర్చుకున్న విషయాలను ముందుగా ప్రతిఫలమో, పుణ్యమో, పేరు ప్రతిష్టలో ఆశించి అయినా సరే శ్రద్ధగా ఆచరించటం అలవాటు చేసుకోవాలి. ఇలా రజోగుణ సహాయంతో తమోగుణాన్ని జయించవచ్చు. ఇక ఆ తరువాత మనం ఆశించిన ప్రతిఫలమో, పుణ్యమో, పేరు ప్రతిష్టలో మనకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తున్నాయి, ఎంత కాలం నిలిచి ఉంటున్నాయి అని విచారణ చేయటం ద్వారా, వాటి అశాశ్వతత్వాన్ని చక్కగా తెలుసుకోవటం ద్వారా, రజోగుణాన్ని దాటి సత్వగుణ ప్రధానులమై నిష్కామ కర్మాచరణం అలవర్చుకోగలం.

ఇలా కర్తృత్వ భావన లేకుండా, ఎట్టి ఫలితాన్ని ఆశించకుండా కేవలం భగవదాదేశం ప్రకారం కర్మలు చేస్తూ, అవికూడా ఆయనే చేయిస్తున్నాడు తప్ప నేను కేవలం ఒక పనిముట్టునే అనే భావనతో పనులు చేయటం కర్మలో అకర్మ అనబడుతుంది. తద్వారా మనకు ఎట్టి కర్మ ఫలాలు అంటక చివరికి ఈ జన్మ పరంపర నుంచి మోక్షం సిద్ధిస్తుంది.