22, అక్టోబర్ 2015, గురువారం

శ్రీకంఠార్ధ శరీరిణీ

జగన్మాతకు ఉన్న అనంతమైన నామాలలో 'శ్రీకంఠార్ధ శరీరిణీ' ఒకటి. శ్రీకంఠుడైన పరమేశ్వరుని శరీరంలో అర్ధభాగమైన తల్లి. శ్రీకంఠుడు అంటే మంగళకరమైన కంఠం కలవాడు. మరి ఆయన కంఠం మంగళకరం ఎలా అయ్యింది అంటే లోకాలనన్నింటినీ త్రుటిలో భస్మీపటలం చేయగల హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు కాబట్టి. అయితే ఈ ఘటనలో అమ్మవారి పాత్ర విశేషమైనది.

మ్రింగెడి వాడు విభుండని
మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో

అన్నారు పోతనా మహాత్ములు. చేసేది ఎంత ప్రమాదకరమైన పనో తెలిసికూడా తన భర్తని అందుకు ప్రోత్సహించింది ఆ తల్లి. అయితే ఆయన ఒక్కడే మ్రింగాడా? అంటే లేదు, ఆయనతో సమానంగా ఆవిడా మ్రింగింది. ఎందుకంటే ఆ తల్లి శ్రీకంఠార్ధ శరీరిణీ. మరి తన మాంగల్యం మీద అంత నమ్మకం ఎందుకు? అంటే 'శివా రుద్రస్య భేషజీ' అని చెప్పారు. ఆయనకు ఏం జరిగినా తిరిగి స్వస్థత చేకూర్చగల అద్భుతమైన వైద్యురాలు ఆతల్లి.

మరి మన మాటేమిటి? అని దిగులు పడక్కర్లేదు. 'శివా విశ్వస్య భేషజీ' - మన రోగాలన్నీ కూడా నివారించే భవరోగ వైద్యురాలు ఆ తల్లే. అటువంటి చల్లని తల్లి మనందరికీ ఆయురారోగ్యాలను, తరగని సంపదయైన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు.

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

ఎందరో మహాత్ములు

మనం ఏ పని చేసినా దానికి రెండు ప్రయోజనాలు ఉండాలని ఆర్ష ధర్మం నిర్ణయించింది - ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ అని. 1) మనకు మోక్షం కలగటం 2) జగత్తుకు హితం కలగటం. ఈ రెండు ప్రయోజనాలు సాధించలేని పనులన్నీ మనకు కర్మలుగా చుట్టుకుంటాయి.

చివరికి మనం తినే ఆహారం కూడా భగవంతుని నివేదన కోసం వండి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించాలిగానీ మన రుచులకోసం, మన ఆకలి కోసం కాదు అని "యజ్ఞ శిష్టామృత భుజః యాన్తి బ్రహ్మ సనాతనం", "భుంజతేతే త్వఘం పాపా యే పచంత్యాత్మ కారణాత్" వంటి గీతా వాక్యాల ద్వారా చెప్పబడింది. "ఒక యోగి ఆత్మకథ" అనే గ్రంథంలో శ్రీ పరమహంస యోగానంద వారు తమ తల్లిదండ్రులు కేవలం సంతానప్రాప్తి అనే ధర్మం కోసం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే సంసారం చేసేవారని వ్రాసారు.

ఇటువంటి ధర్మానికి మూలస్థంభాలనదగిన ఎందరో మహాత్ములు ఏకాంతంగా సాథన చేసుకొని మోక్షాన్ని పొందుతున్నారు. అయితే అలా పొందిన వారిలో కొద్దిమంది మాత్రమే మళ్ళీ సద్గురువులుగా వచ్చి జనబాహుళ్యాన్ని సన్మార్గంలో నడిపి ఉద్ధరిస్తున్నారు. మరి అలా రాకుండా ఏకాంతంలోనే ఉండిపోయిన మహాత్ముల వలన జగద్హితం ఎలా సమకూరుతుంది? అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుంది.

దీనికి సమాధానమా అన్నట్లు మా గురుదేవులైన శ్రీబాబూజీ మహరాజ్ ఎన్నోసార్లు తమ బోధలో ఇలా చెప్పేవారు - ఎందరో మహాత్ములు హిమాలయాలలో, అడవులలో, కొండ గుహలలో తపస్సు చేసుకుంటూ ప్రతి ఉదయం తమ సాథననుండి బయటకు వచ్చి తమ తపశ్శక్తినంతా ధారపోసి "సర్వే జనాః సుఖినో భవంతు" "లోకాస్సమస్తా సుఖినో భవంతు" అని ఆశీర్వదించి తిరిగి తమ సాథనలో లీనమవుతూ ఉంటారు. వారెవరో ఈ లోకానికి పరిచయం లేకపోయినా కేవలం వారి ఆశీస్సుల వల్లనే ఈ లోకం ఇలా పచ్చగా కళకళలాడుతోంది. అందుకు మనం వారందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి.

26, ఆగస్టు 2015, బుధవారం

వాసనలు

వేదాంత పరిభాషలో వాసనలు మూడు రకాలు. దేహ వాసన, లోక వాసన, శాస్త్ర వాసన. అసలీ వాసన అంటే ఏమిటో, అది ఎలా వస్తుందో తెలుసుకుందాం.

శరీరం ధరించిన ప్రతివాడికీ ఆ శరీరం ఉన్నంతవరకు ఏదో ఒక పని చేస్తూ ఉండక తప్పదు. కానీ గరిటతో కలపవలసిన సాంబారు చేత్తో కలిపితే ఆ చేతికి వాసన అంటుకున్నట్టు, శరీరంతో చేయవలసిన పనులకు మనస్సును జత చేస్తే మనస్సుకు ఆ వాసన అంటుకుంటుంది.

శరీరానికి ఆకలి వేసిందనుకోండి, తినగలిగిన పదార్ధం అప్పటికి ఏది దొరికితే అది లోపల వేస్తే ఆ ఆకలి తీరిపోతుంది. కానీ ఆ సమయానికి మనం ఏ శరవణ భవన్కో వెళ్ళామనుకోండి, శరీరం ఆకలి తీరటంతోపాటు అక్కడ వంటకాలు బాగుంటాయి అనే ఒక గుర్తు మనస్సులో నాటుకుపోతుంది. అదే వాసన. అయితే మీరు మనస్సు పెట్టి తినకపోతే ఈ వాసన అంటదు. నిజానికి ఆకలి వేయటం, ఆహారం తినటం, కడుపు నిండటం ఇవన్నీ కేవలం దేహానికి సంబంధించిన విషయాలు. కేవలం ఒక దేహ క్రియగా ఉండవలసినదానికి మనసు చేర్చటంతో అది వాసనగా అంటుకొని చివరికి కర్మగా మారుతుంది.

ఇక దేహ వాసన అంటే ఈ దేహం నేను అనే నిశ్చితమైన నమ్మకం. అది ఈ దేహానికి పెట్టుకున్న పేరుపై కూడా అంతే గాఢంగా ఉంటుంది. నా పేరు ప్రసాదు అనుకోండి, పిలిచేది నన్నే అని తెలిసినా ప్రసాదరావు అంటే పలకను. పేరు కేవలం దేహానిదే అయినా, అది కేవలం సౌలభ్యం కోసం పెట్టుకునన్నదే అయినా, మహాత్ముల సన్నిధిలో కూడా దాని మీద అభిమానాన్ని వదులుకోలేము.

శాస్త్ర వాసన అంటే మనం చదువుకున్న పుస్తకాలలో, విన్న విషయాలలో ఉన్న విజ్ఞానమే సర్వస్వం అని బలంగా విశ్వసించటం. పరిమితమైన మానవ జీవితకాలంలో పరిపూర్ణ విజ్ఞానాన్ని కేవలం చదువుద్వారా పొందటం ఎవరికీ సాధ్యం కాదు. కేవలం తనను తాను తెలుసుకొన్న బ్రహ్మజ్ఞానికే సర్వం తెలియబడుతుంది. కానీ మనం మనకున్న పరిమిత జ్ఞానంతోనే అనంతుడైన భగవంతుణ్ణి, అయన ప్రతిరూపాలైన అవతార పురుషుల్ని, మహాత్ముల్ని అంచనా వేయాలని చూస్తాం. మనకు తెలిసిన గుప్పెడు ధర్మ సూత్రాలతో ధర్మాధిష్టానమైన పరమాత్మనే అంచనా వేస్తూ రాముడు అలా ఎందుకు చేసాడు? కృష్ణుడు ఇలా ఎందుకు చేసాడు? అని వాదిస్తాం. అనంత విశ్వంలో అతి చిన్న భాగమైన మన సమాజపు కట్టుబాట్లతో అనంతుడైన భగవంతుణ్ణి బంధించాలని చూస్తాం. మనమీద కరుణించి ఆ భగవంతుడే ఏ కుక్క రూపంలోనో ప్రత్యక్షమైతే శాస్త్రాలలో చెప్పిన ఆకారంలో రాలేదని గుర్తించటానికి నిరాకరిస్తాం. తులసీదాసు అంతటి మహాభక్తుడికే ఈ పరిస్థితి తప్పలేదు.

ఇక లోక వాసన - ఈ లోకంలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ కొన్ని అభిప్రాయాలూ అలవాట్లూ ముందే ఏర్పరుచుకొని ప్రతిదానిని ఆ కోణంలోనే చూస్తాం. ఒక వ్యక్తి మనకు ఏదో మంచో చెడో చేస్తే, అలాంటి వేషభాషలు, ఆ కులం, ఆ మతం, ఆ జాతికి సంబంధించిన వారందరికీ, వాళ్ళెవరో మనకు తెలియకపోయినా, అవే గుణాలు అంటగడతాం. సిగరెట్టు కోసం పరాయి వాళ్ళని అగ్గిపెట్టె అడగడానికి కూడా సిగ్గుపడం కానీ ఏ ఆశ్రమనికో సత్సంగానికో వెళ్ళాలంటే నలుగురూ ఏమనుకుంటారో అని సిగ్గుపడతాం.

మన కంటికి కనపడకుండా ఎక్కడో గోడవతల ఉన్న పువ్వు వాసన కూడా మనదాకా చేరినట్లు, ఈ వాసనలు మనను జన్మజన్మలదాకా వెంటాడుతూనే ఉంటాయి. సాధనద్వారా మన మనస్సు ప్రక్షాళన చేసుకొనేదాకా ఈ వాసనలు తప్పవు.

30, జులై 2015, గురువారం

కారు చీకటిలో కాంతి రేఖ

అది 1990వ సంవత్సరం. గుంటూరు, కృష్ణా జిల్లాలను అతలాకుతలం చేసిన పెను తుఫాను తీరం చేరుతున్న సమయం. నేను బయటినుండి మా ఇంటి వైపుగా నడుస్తున్నాను. అప్పటికే కరెంటు పోయి చిమ్మచీకటి అలుముకుంది. అయినా తెలిసిన దారే కనుక అలాగే తడుముకుంటూ వెళ్తున్నాను. సరిగ్గా మా ఇంటి చివర మలుపు తిగుతుండగా ఒక్కసారిగా పెద్ద మెరుపు మెరిసింది. తరువాతి అడుగు వేయటానికి కాలు ఎత్తిన నేను, ఆ వెలుగులో అక్కడి బురదను చూసి చటుక్కున కాలు వెనక్కు తీసుకుని ప్రక్కనుంచి వెళ్ళాను. అక్కడ ఎంత బురదగా ఉందంటే, అందులో కాలు వేస్తే ఎక్కడో తేలేవాడ్ని. ఆ చీకట్లో, గాలివానలో నా అరుపులు కూడా ఎవరికీ వినిపించేవి కావు. సందర్భం గుర్తులేదు కానీ ఇలాగే ఇంకో ఒకటి రెండుసార్లు కూడా జరిగింది.

నేను డిగ్రీలో ఉండగా తరచుగా కాలేజి ఎగ్గొట్టి సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అలా ఒకరోజు కాలేజీకని బయలుదేరి రోడ్డుమీద నడుస్తూ, ఇవాళ ఏ సినిమాకి వెళదామా అని ఆలోచించుకుంటూ ఉండగా, ఒక్కసారిగా నాకు చాలా ఆవేదన కలిగింది. శ్రీగురుదేవులను మనస్సులోనే ఇలా ప్రశ్నించుకున్నాను. "నేను మామూలు బురదలో కాలు వేసి పడబోతుంటేనే అలా వెలుగు చూపించి నన్ను కాలు జారకుండా ఎన్నోసార్లు కాపాడారు కదా, మరి ఇలా క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూస్తూ జీవితం పాడు చేసుకుంటూ ఉంటే ఎప్పుడూ అడ్డుకోరు ఎందుకు?" అని.

వెంటనే నా మనసులోనుండే నాకు సమాధానం వినిపించింది. "నేను నిన్ను ఎప్పుడూ బురదలో కాలు వేయకుండా ఆపలేదు, అలాగే నిన్ను బలవంతంగా వెనక్కు లాగలేదు. నేను కేవలం చీకట్లో ఉన్న నీకు అక్కడ బురద ఉందని మాత్రమే చూపించాను. బురదలో కాలు వేస్తే కలిగే పరిణామం ఏమిటో నీ బుద్ధిలో బాగా నాటుకుని ఉంది కాబట్టి, నీ అంతట నువ్వే కాలు వెనక్కు తీసుకున్నావు. మరి అలాగే నువ్వు క్లాసులు ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళిన ప్రతిసారీ నేను నీకు నీ తప్పును ఏదో ఒక రూపంలో సూచిస్తూనే ఉన్నాను. కానీ ఆ తప్పువల్ల కలిగే పరిణామం నీ బుద్ధిలో బలంగా నాటుకోని కారణంగా నువ్వు నా సూచనలను పట్టించుకోకుండా నీ తప్పును కొనసాగిస్తూ వచ్చావు." అని.

"నిజంగా దేవుడనేవాడు ఉంటే నా తప్పులను ఎందుకు అడ్డుకోడు?" అని ప్రశ్నించే వారందరూ ఒక్కసారి వారి అంతరాత్మను తరచి చూసుకుంటే భగవంతుడు ఎన్ని విధాలుగా మన తప్పులను తెలియజేస్తున్నాడో మనకే తెలుస్తుంది. కానీ మనలోని బలహీనతల కారణంగా మనం ఆ సూచనలను పట్టించుకోకుండా, చివరికి ఆ తప్పుల ఫలితాలను అనుభవించాల్సి వచ్చిన సందర్భంలో భగవంతుని నిందిస్తాం.

భగవంతుడు/గురుదేవుడు ఒక మార్గదర్శి మాత్రమే. అయన చూపించిన మార్గంలో పయనం చేయటం పూర్తిగా మన కర్తవ్యమే. మన పిల్లలు బాగా పసివారిగా ఉన్నప్పుడు వారిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాం. కానీ వారు కాస్త పెద్దవారు అయిన తరువాత మనం కేవలం సలహాలనే ఇస్తాం కానీ వారిని ప్రతి విషయంలో అడ్డుకోము. ఎందుకంటే వారి తప్పులనుంచి వారు కూడా నేర్చుకోవాలని భావిస్తాం. కానీ ఎంత పెద్దవారైనా, ఎన్ని తప్పులు చేసినా, వాళ్ళకు దాటలేని అపాయాలు ఎదురైనప్పుడు మాత్రం మనం తప్పకుండా రక్షణకు పరుగు పెడతాం. అలాగే భగవంతుడు కూడా మన తప్పులనుండి నేర్చుకోవటానికి మనకు అనేక అవకాశాలు ఇస్తాడు. అంతమాత్రం చేత మనం నిజంగా ప్రమాదంలో పడినప్పుడు మాత్రం కేవలం మార్గదర్శనమే చేయాలని చూస్తూ ఊరుకోడు. తప్పకుండా మనలను రక్షిస్తాడు.

అలాంటి సంఘటనలు నా జీవితంలో ఎన్నో! మచ్చుకకి ఒకటి - న్యూయార్క్ లో ఒక ఎలక్ట్రానిక్స్ షాపుకి వెళ్ళి, ఎస్కలేటర్ మీద నుంచుని కూడా, నాకున్న సహజ కుతూహలంతో ప్రక్కకు వంగి క్రింద ఉన్న ఏవో అట్టపెట్టెల మీద పేర్లు చదువుతున్నాను. ఉన్నట్టుండి ఎవరో నా తలను వెనక్కు లాగినట్టు అయింది. వెనకాల ఎవరూ లేరు కానీ ఒక్క క్షణం నా తల అలా వెనక్కు తీయడం ఆలస్యమై ఉంటే, ఎస్కలేటర్ ప్రక్కనే ఉన్న సీలింగుకి నా తల గట్టిగా కొట్టుకుని బుర్ర పగిలి ఉండేది. 

21, జులై 2015, మంగళవారం

ఆథ్యాత్మికం - సోషలిజం

కొంతమంది "చాతుర్వర్ణం మయా సృష్టం" అనే గీతా వాక్యాన్ని ఉటంకించి, భగవంతునికే భేద భావనను అంటగట్టి ఆ సాకుతో ఇతరులను నీచంగా చూస్తారు. కానీ అదే భగవద్గీతలో ఎన్నో సందర్భాలలో సమానత్వాన్ని గీతాచార్యుడు ప్రబోధించిన విషయాన్ని వీరు పట్టించుకోరు.

"విద్యావినయ సంపన్నే బ్రాహ్మణే, గవి, హస్తిని, శునిచైవ, శ్వపాకేచ పండితాః సమదర్శనః" అనే గీతావాక్యం ద్వారా విద్యా వినయ సంపద కలిగిన బ్రాహ్మణునియందు, గోవుయందు, ఏనుగునందు, కుక్కయందు, ఆ కుక్క మాంసం వండుకు తినేవానియందు పండితుడైనవాడు సమదృష్టి కలిగి ఉంటాడని శ్రీకృష్ణభగవానుడు నొక్కి వక్కాణిస్తున్నాడు. ఇలా సమాజంలో విభిన్న స్థాయిలలో ఉన్నారనుకునే వారినేకాక అనేక ఇతర రకాలైన ప్రాణులను కూడా సమాన దృష్టితో చూసేవాడే పండితుడు.

ఇక "సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే" అనే శ్లోకం ద్వారా నీకు స్నేహితులు, మిత్రులు, శత్రువులు, నిన్ను పట్టించుకోనివారు, మిత్రులూ శత్రువులూ కాక మధ్యస్తంగా ఉండేవారు, నిన్ను ద్వేషించేవారు, నీకు బంధువులు, సాధువులు, పాపులు - ఇలా అన్ని రకాల మనోభావాలు, సంబంధాలు ఉన్నవారి పట్ల సమభావం కలిగి ఉండటమే విశేషలక్షణంగా వర్ణించబడింది. ఇంకా "సమత్వం యోగ ఉచ్యతే" - సమత్వమే యోగము అని కూడా చెప్పబడింది.

వివేకచూడామణిలోని "జాతి నీతి కుల గోత్ర దూరగం, నామ రూప గుణ దోష వర్జితం, దేశ కాల విషయాతి వర్తియత్, బ్రహ్మ తత్త్వమసి భావయాత్మని" అనే శ్లోకాన్ని మా గురుదేవులైన శ్రీ బాబూజీ మహారాజ్ వారు తరచుగా ప్రస్తావిస్తూ ఉండేవారు. అలాగే ఆథ్యాత్మికాన్నిమించిన సోషలిజం ఎక్కడా లేదని కూడా చెప్పేవారు.

ఈ సృష్టిలోని సమస్త జీవులలో, వస్తువులలో తానే నిండి ఉన్నానని విభూతి యోగంలో గీతాచార్యుడు బోధించినప్పుడు అర్జునుడు ఆ విశ్వరూపాన్నిదర్శించాలని ఆకాంక్షించాడు. అప్పుడు శ్రీ కృష్ణ భగవానుడు "అయితే ఇదిగో నా విశ్వరూపాన్ని చూడు" అన్నాడు. కానీ అర్జునునికి ఏమీ కనిపించలేదు. అప్పుడు భగవానుడే కరుణించి "ఈ నీ చక్షువులతో నా విశ్వరూపాన్ని దర్శించలేవు. ఇదిగో నీకు దివ్య చక్షువులను ప్రసాదిస్తున్నాను. వాటితో నా విశ్వరూపాన్ని దర్శించు" అని అర్జునునికి దివ్య దృష్టిని ప్రసాదించి తన విశ్వరూపాన్ని దర్శింపచేసాడు. అప్పుడు అర్జునునికి అంతవరకూ తన ఎదుటనున్న కృష్ణుడు, చుట్టూ ఉన్న పెద్ద సైన్యం, ఇంకా విశ్వంలోని సమస్త ప్రాణులు, చివరికి తనతో సహా మొత్తం ఆ విశ్వరూపంలోనే కనిపించారు.

ఈ సందర్భంలో "సర్వ భూతస్థ మాత్మానం, సర్వ భూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః" - సమదర్శనుడైన యోగి సర్వ ప్రాణులలో ఉన్నది తానేనని, తనలోనే సర్వ ప్రాణులు ఉన్నాయని ఆత్మజ్ఞానంతో దర్శించగలుగుతాడని తెలిపే గీతావాక్యానికి అర్థంగా నిలిచాడు అర్జునుడు. అయితే ఇక్కడ "కృష్ణుడు అంతకుముందు మాములుగా ఉండి అప్పుడే విశ్వరూపాన్ని పొందాడా?" అంటే "కాదు" అనే సమాధానం వస్తుంది. ఆయన ఎప్పుడూ మార్పు లేకుండా విశ్వరూప స్థితిలోనే ఉన్నాడు. ఇక్కడ మారింది అర్జునుని దృష్టి మాత్రమే.

ఇలా మన దృష్టిని ఆథ్యాత్మిక సాధన ద్వారా మార్చుకోగలిగిన నాడు, మా ఆశ్రమ నిత్య ప్రార్థనలో భాగమైన "మానవునికీ మానవునికి మధ్య భేదబుద్ధి నశించి, సర్వ జీవులు సమభావముతోనూ ప్రేమ దృష్టితోనూ మెలగుదురు గాక. లోకములన్నియు శాంతి సౌఖ్యములతో వర్ధిల్లును గాక." అనే వాక్యాలు నిత్య సత్యాలుగా నిలుస్తాయి. ఇంతకు మించిన సోషలిజం ఎక్కడ ఉంటుంది?

6, జులై 2015, సోమవారం

త్యాగాత్ శాంతిరనంతరం



మనం పూజలు కానీ, వ్రతాలు కానీ, జపం కానీ రోజూ చేసుకునే అలవాటు/అభ్యాసం అయితే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం. అయితే అలా కేవలం అభ్యాసంగా కాకుండా వాటిలోని అర్థాన్ని తెలుసుకొని చేయటం ఉత్తమమని "శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్" అని భగవద్గీత బోధిస్తోంది.  దీనినే "తెలిసి రామ చింతన చేయమని" శ్రీ త్యాగరాజ స్వామివారు బోధించారు. 

అయితే కేవలం అర్థం తెలుకున్నంత మాత్రాన సరిపోదు, దానిమీద నీ మనస్సునుంచి నీ ధ్యానంలో నిలుపుకుని చేయాలని "జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే" అని కూడా చెబుతోంది. 

కానీ, అర్థం తెలుసుకొని, ధ్యాస నిలిపి సత్కర్మలు ఆచరించినప్పటికీ వాటిని ఏదో ప్రయోజనం ఆశించి చేయటం వలన అవి కామ్య కర్మలుగా మారి చివరికి బంధాన్నే కలిగిస్తాయి. అందుకనే ధ్యానం కన్నా కూడా కర్మఫల త్యాగం గొప్పదని "ధ్యానాత్ కర్మఫల త్యాగః" అని చెప్పబడింది. 

ఇక అలా ఫలితాన్ని భగవంతునికే విడిచిపెట్టి సత్కర్మలను ఆచరించటం వలన మనకు శాశ్వతమైన శాంతి లభిస్తుంది. దీనినే భగవద్గీత "త్యాగాత్ శాంతిరనంతరం" అని నొక్కి వక్కాణిస్తోంది. 

మా గురుదేవులైన శ్రీబాబూజీ మహరాజ్ వారు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు - చెరువు దగ్గరకు ఒక గ్లాసు తీసుకువెళితే నీకు గ్లాసుడు నీళ్ళే వస్తాయి. అలాగే చెంబుతో వెళ్ళిన వాడికి చెంబుడు నీళ్ళు, బిందెతో వెళ్ళిన వాడికి బిందెడు నీళ్ళు లభిస్తాయి. కాని ఏమీ తీసుకువెళ్ళకుండా తానే వెళ్ళి చెరువులో మునిగిన వాడికి ఆ చెరువంతా తనదే అవుతుంది. చూసారా ఫలితం ఆశించని వాడికి ఎంతటి ఫలితం దక్కుతుందో? ఇక వాడి మనసులో అశాంతికి తావెక్కడిది? 

2, జూన్ 2015, మంగళవారం

సత్య గురుదేవులు vs. నకిలీ గురువులు


 ఈనాటి సమాజంలో సహజంగా చాలామందికి కలిగే ప్రశ్న ఇది. “ఇంతమంది నకిలీ గురువులను చూస్తున్నాం కదా. ఇందులో సత్య గురుదేవులను గుర్తించటం ఎట్లా?” అని. కొంతమంది అయితే ఇంకో అడుగు ముందుకు వేసి “అసలు మాకు గురువుల వ్యవస్థ మీదే నమ్మకం పోయింది. మేము సత్య గురువులను వెదికి ఆశ్రయించవలసిన పని ఏముంది?” అంటారు.

ఇప్పుడే కాదు, ఎన్నో దశాబ్దాల పూర్వమే మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారిని ఎంతోమంది ఇలా ప్రశ్నించి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇలాంటి ప్రశ్న వేసిన వారిని మా గురుదేవులు తిరిగి ఒక ప్రశ్న అడిగేవారు. నీకు ఒక రోగం వచ్చిందనుకో. “బజారులో నకిలీ మందులు బాగా ఎక్కువ అయిపోయాయి” అని చెప్పి మందు తీసుకోవటం మానేస్తావా? అలాగే నకిలీ వైద్యులు ఎక్కువగా ఉన్నారని వైద్యం చేయించుకోవటం మానేస్తావా? నీకు రోగం తగ్గటం ముఖ్యం. అందుకని, కష్టపడి వెదికి అయినా సరే మంచి వైద్యుని సంప్రదించి అతను వ్రాసిన మందులను కూడా మంచివి వెదికి వేసుకుంటావు కదా. అలాగే భవరోగంతో బాధపడే ప్రతి ఒక్కరూ సత్య గురుదేవులను వెదికి ఆశ్రయించి తరించటానికి ప్రయత్నించవలసిందే.

సత్య గురుదేవులు ఎప్పుడూ నీ దగ్గర నుండి ఏమీ ఆశించరు. ఎందుకంటే పూర్ణ స్వరుపులైన వారికి కొత్తగా పొందవలసింది ఏమీ లేదు. వారు మననుంచి ఆశించేది మన భక్తిని, పరిపూర్ణ విశ్వాసాన్ని మాత్రమే. అది కూడా మనం తరించడానికే కానీ వారికి ఒరిగేది ఏమీ ఉండదు. అలా కాక కొందరు గురువులు నమస్కారానికి, పూజకి, సంభాషణకి ఇలా ప్రతి దానికి ఒక వెల నిర్ణయించి వసూలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని మా గురుదేవులు “చేతిలో రూపాయి – చెవిలో మంత్రం గురువులు” అనేవారు.

నా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఒక పద్యం చదువుతూ ఉండేది.
ఈవికాశించు గురువును,
నా వద్దొక కాసు లేదు
పోపో మనెడి శిష్యుడును
కేవల హీనాత్ములనుచు కీర్తింపతగున్
ఇది విని నేను అనుకునే వాడిని – ఇలాంటి వారిని కీర్తించటం కూడా ఎందుకు దండగ అని.

ఇక అసలు గురువులతో పని ఏముంది? మనమే నేరుగా భగవంతుని చేరలేమా? అనే ప్రశ్నకు వస్తే మనకు శ్రీనామదేవుల వారి చరిత్ర ఇందుకు చక్కని సమాధానం చూపిస్తుంది. మీలో ఎవరైనా చక్రధారి సినిమా చూసి ఉంటే అందులో కూడా ఈ చరిత్రను చూపించటం జరిగింది. శ్రీనామదేవుల వారు స్వయంగా శ్రీపాండురంగని దర్శించి, ప్రతిరోజూ  స్వామితో సంభాషిస్తూ, స్వయంగా స్వామికి నివేదన తినిపించగలిగిన పరమ భక్తులు. కానీ శ్రీజ్ఞానదేవుల వారి ఆదేశంతో గోరా కుమ్హార్ అనే భక్తుడు వారిని పరీక్షించి ఇది ఇంకా పచ్చి కుండే అని నిర్ధారిస్తాడు. అది విని క్రుద్ధులైన శ్రీనామదేవుల వారు పాండురంగని ఆలయంలో ప్రవేశించి స్వామి వద్ద తమ ఆవేదనను వెలిబుచ్చితే అప్పుడు స్వామే స్వయంగా వారికి తెలియజేస్తారు – “నీవు ఎంతటి పరమ భక్తుడవైనా ఒక గురువుని ఆశ్రయించి జ్ఞానాన్ని పొందనిదే పరిపూర్ణుడవు కాలేవు, ముక్తిని పొందలేవు” అని.

మరి సత్య గురుదేవులని తెలుసుకోవటం, వారిని ఆశ్రయించటం ఎట్లా? నీ భక్తి, ఆవేదన గాఢమైనప్పుడు భగవంతుడే సత్య గురుదేవుల రూపంలో నీ వద్దకు నడచి వస్తాడు. “అప్రత్యక్షో మహాదేవః సర్వేషాం ఆత్మ మాయయా! ప్రత్యక్షో గురు రూపేణ వర్తతే భక్తి సిద్ధయే!!” అయితే అట్టి గురుదేవులు లభించినప్పుడు కూడా ఇంకా మూర్ఖంగా ప్రవర్తించి వారిని కోల్పోకుండా సరియైన సమయంలో వారిని గుర్తించి ఆశ్రయించినప్పుడే మనం ప్రయోజనాన్ని పొందగలుగుతాం.


అలా కాకుండా నేను భగవంతునే నేరుగా చేరుకుంటాను, ఈ గురువుల అవసరం ఏముంది అని వాదించేవాళ్ళు - నాకు ఎంతో చదువు వచ్చు, లేదా నా ఇంట్లో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఇక మా పిల్లలకు బడి ఎందుకు అని మాన్పిస్తున్నారా? తమకు రోగం వస్తే వైద్యుడు ఎందుకు అని తమ వైద్యం తామే చేసుకుంటున్నారా? తమ ఇల్లు తామే కట్టుకుంటున్నారా? తమ భోజనం తామే పండించుకుంటున్నారా? తమ బట్టలు తామే నేసుకుంటున్నారా? ఇలా జీవితంలో ప్రతి దానికీ ఇతరుల మీద ఆధారపడి, వారి సహాయాన్ని తీసుకునే మానవులు, భగవంతుని విషయం వచ్చేసరికి మాత్రం అంతా తమకే తెలుసునని, ఇక గురువుల అవసరం ఏమున్నదని అజ్ఞానంతో ప్రశ్నిస్తారు.

31, మార్చి 2015, మంగళవారం

భోజనంలో రకాలు

మనం తినే భోజనంలో కూడా మన గుణాలను అనుసరించి మూడు రకాలు ఉన్నాయని భగవద్గీతలో చెప్పబడింది. అవేమిటో చూద్దాం.

సత్వగుణ ప్రధానుల భోజనం:

ఆయుః సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః ||

ఆయుష్షును, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంపొందింపచేసేది, రసవంతమైనది, చక్కగా మెరిసేది, చూడగానే కంటికి, ముక్కుకు, హృదయానికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించే భోజనం సత్వగుణ ప్రధానులైన వారికి ఎంతో ఇష్టమైనది. ముఖ్యంగా ఏ పూటకు ఆ పూట చక్కగా వండుకొని భగవంతునికి నివేదించి తీసుకునే ఆహారం సాత్వికమైనది.

రజోగుణ ప్రధానుల భోజనం:

కట్వామ్ల లవణాత్యుష్ణ తీక్ష రూక్ష విదాహినః |
ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః ||

ఇక చేదుగా, పుల్లగా ఉండేవి, అతిగా వేడి చేసేవి, ఎండినట్లు ఉండేవి (ఫ్రైడ్ రైస్ లాంటివి), ఎక్కువగా వేయించినవి, ఎక్కువగా దాహాన్ని కలిగించేవి (మసాలాలు) అయిన ఆహారాలు రజోగుణ ప్రధానులు ఇష్టంగా తింటారు. అయితే ఇవి తినేటప్పుడు ఇష్టంగా ఉన్నా ఆ తరువాత దుఃఖాన్ని, శోకాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. ఇంతకుముందు మనం రాజసిక సుఖంలో గారెల గురించి చెప్పుకున్నాం కదా.

తమోగుణ ప్రధానుల భోజనం:

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం ||

ఇక పోతే మనం ఇదివరలో చెప్పుకున్నట్లు తమోగుణ ప్రధానులైనవారు తాము ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తమకే తెలియకుండా ఉంటారు. అందువలన వారికి సారహీనమైనవి, శక్తి అంతా పోయినవి, బూజు పట్టినవి, ఎంగిలివి, అసలు తినకూడనివి అయిన పదార్థాలు కూడా ఎంతో ఇష్టంగా ఉంటాయి. ఈ రోజులలో ఓపిక, తీరిక లేని జీవితాలతో మనం ఒకరోజు వండుకుని, ఫ్రిజ్ లో పెట్టుకుని, పది రోజులపాటు తినేవన్నీ ఇలాంటివే.

ఈ విధంగా మనలో ఉన్న గుణాలు మనం తినే ఆహారంయొక్క స్వభావాన్ని ఎలా నిర్ణయిస్తున్నాయో అలాగే మనం తినే ఆహారం కూడా మనలో ఆయా గుణాలను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది నిరూపించటానికి పెద్దలు ఒక సంఘటనను ఉదహరిస్తారు.

ఒకనాడు ఒక సన్యాసిని ఒక ఇల్లాలు తన ఇంట భోజనానికి ఆహ్వానించింది. అయితే భోజనం చేస్తున్న సమయంలో ఆ సన్యాసికి తనకు మంచినీళ్ళు పెట్టిన వెండి చెంబును తస్కరించాలనే కోరిక కలిగింది. అయన మహాత్ముడు కనుక వెంటనే గ్రహించి ఆ ఇల్లాలిని అడిగాడు "తల్లీ! ఈ మీ ఐశ్వర్యం అంతా ఎలా సంపాదించారు? నిజం చెప్పు" అని. ఇక చేసేది లేక ఆ ఇల్లాలు తాము ఆ సంపదనంతా అన్యాయంగానే సంపాదించామని ఒప్పుకుంది. "నీ ఇంట భోజనం చేయటం వల్ల సర్వసంగ పరిత్యాగినైన నాకు కూడా ఈవేళ చోరబుద్ధి కలిగింది. దయచేసి మీ ప్రవర్తన మార్చుకోండి. అలాగే ఇంకెప్పుడూ నన్ను మాత్రం భోజనానికి పిలువకండి" అని చెప్పి ఆ సన్యాసి అక్కడనుండి నిష్క్రమించాడు.



17, మార్చి 2015, మంగళవారం

గొల్ల-గుల్ల-గోవింద

సాధకుడైనవాడు భగవంతుని పొందటానికి తన మనస్సుని ఏవిధంగా మార్చుకోవాలి అనే విషయంలో మా గురుదేవులు శ్రీబాబూజీ మహారాజ్ వారు ఒక చక్కని సన్నివేశాన్ని తెలిపేవారు.

నిజానికి రాధాకృష్ణులు తత్వతః ఏకస్వరుపులైనా రాధకి కృష్ణునితో భౌతికంగా నిరంతర సాన్నిహిత్యం లభించేది కాదు. రోజులో ఏ కొద్ది సమయమో మాత్రమే ఆమె శ్రీకృష్ణునితో గడపగలిగేది. మిగిలిన గోపికలందరిదీ కూడా ఇదే పరిస్థితి. కానీ రోజులో ఒక్క క్షణం కూడా విడువకుండా, నిరంతర సాన్నిధ్యాన్ని పొందగలిగింది మాత్రం వేణువు ఒక్కటే. ఈ విషయంలో రాధాదేవికి కొంత అసూయతోపాటు, అసలు ఇంతటి భాగ్యాన్ని పొందటానికి ఆ వేణువు చేసిన సాధన ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత కూడా ఉండేది. అయితే కృష్ణుడు లేని సమయంలో ఆ వేణువును చేజిక్కించుకోవటం ఎలా?

కరుణామయుడైన గోవిందుడే ఆ అవకాశాన్ని కల్పించాడు. ఒకనాడు యమునాతీరంలో ఇసుక తిన్నెలపై శయనించినప్పుడు, రాధకోసమే అన్నట్లుగా తన చేతిలోని వేణువును జారవిడిచాడు. రాధాదేవి వెంటనే ఆ వేణువును దొరకబుచ్చుకొని ఒక పొదరిల్లు చాటుకి వెళ్ళి ఆ వేణువును ప్రశ్నించింది, "ఇలా నిరంతరం గోవిందుని సాన్నిధ్యాన్ని పొందటానికి నీవు చేసిన పుణ్యం ఏమిటని". అప్పుడు ఆ వేణువు నవ్వి ఇలా చెప్పింది. "ఓ రాధా! నేను ఎట్టి సాధనలు చేయలేదు. నాకు ఏమీ తెలియదు. నువ్వే చూస్తున్నావుగా, నాలో ఏమీ లేదు. ఒళ్ళంతా చిల్లులుగల ఒక వెదురు గొట్టాన్ని మాత్రమే. అయితే నేను ఇలా అంతా ఖాళీ చేసుకోవటమే ఆ పరమాత్మకు నన్ను దగ్గర చేసిన భాగ్యం. అంతేకాదు నిరంతరంగా ఆయన అధరామృతాన్ని గ్రోలుతూ కూడా కొంచెం కూడా నాలో దాచుకోకుండా వేణునాదంగా మార్చి విశ్వమంతటికీ పంచిపెడుతున్నాను. ఇదే నేను చేసే సాధన" అని.

అంతేకాదు, గొల్లవాళ్ళైన బృందావన వాసులందరూ ఇలాగే తమ మనసులను గుల్లగా చేసుకున్నారు. అందుకే ఆ మనసులలో గోవిందుడు ప్రవేశించి వాటిని తనకు అత్యంత ఇష్టమైన నివాసస్థానాలుగా మార్చుకున్నాడు. ఇలాగే మన మనసులను కూడా ఏ విషయాలూ లేకుండా ఖాళీగా చేసుకుంటే ఆ పరమాత్ముడు అందులో ప్రతిష్టితుడై బ్రహ్మానందంలోముంచెత్తుతాడు. అటువంటి సద్భక్తులు ఆ ఆనందాన్ని కూడా తాము దాచుకోకుండా లోకానికంతటికి పంచిపెడతారు.

11, మార్చి 2015, బుధవారం

గుణాలపై విజయం

మనం ఎవరినైనా జయించాలంటే ముందు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. వాళ్ళ బలాలేమిటో, బలహీనతలేమిటో కనిపెట్టాలి. మరి మనలోనే ఉన్నగుణాలను జయించాలంటే వాటి గురించి కూడా మనం ముందుగా తెలుసుకోవాలి కదా. భగవద్గీతలోని 14, 17 మరియు 18వ అధ్యాయాలలో గీతాచార్యుడు ఈ మూడు గుణాలయొక్క స్వభావాన్ని వివిధ ఉదాహరణల ద్వారా చక్కగా వివరించటం జరిగింది.

మనం చేసే ప్రతి పని, మనలోని ప్రతి ఆలోచన, మనకున్న అన్ని లక్షణాలు ఈ మూడు గుణాలతో ప్రభావితమై ఉంటాయి. అందుకే యజ్ఞం, దానం, తపస్సు, ధైర్యం, శ్రద్ధ, అవగాహన, ఆహారం, కర్మలు - ఇలా ప్రతి ఒక్క దాన్ని తీసుకుని అవి సత్వరజస్తమో గుణాలలో ఒక్కొక్క దానిచేత ప్రేరేపించబడినప్పుడు ఏ ఏ విధంగా ఉంటాయో చాలా వివరంగా చెప్పబడింది. వీటన్నిటినీ గమనిస్తే మనకి అన్నిట్లో ఈ గుణాలయొక్క సహజ లక్షణాలు కొంతవరకు అర్థమవుతాయి.

తమోగుణం:

తమోగుణ ప్రధానులైన వారిలో మనం ముఖ్యంగా గమనించతగిన లక్షణం తాము ఏమి చేస్తున్నామో, ఆ పనిని ఎలా చేయాలో, ఆ పని చేస్తే వచ్చే ఫలితమేమిటో ఏమీ తెలియకుండా ఏదో చేసాంలే అనే రీతిలో చేయటం, ఎదుటివారు ఏమి చెప్పినా దానిని తలక్రిందులుగా(విపరీతార్థంలో) అర్థం చేసుకోవటం. ఈ లక్షణానికి ప్రధాన కారణం అజ్ఞానం, సోమరితనం. నిజానికి ఇవి రెండూ వేరువేరని మనం అనుకుంటాం కానీ మా గురుదేవులు సోమరితనమే అజ్ఞానం అని చెప్పేవారు. 

రజోగుణం:

రజోగుణ ప్రధానులైన వారికి ఏ పని ఎలా చేయాలో బాగానే తెలుసు. విషయాలన్నీ బాగానే అర్థం అవుతూ ఉంటాయి. చేసే పనులన్నీ శ్రద్ధగా తప్పులు లేకుండా కూడా చేస్తూ ఉంటారు. కానీ వీరు చేసే ప్రతి పని వెనుక స్వార్థం దాగి ఉంటుంది. ఏదైనా ప్రతిఫలాన్నో, పుణ్యాన్నో, పేరు ప్రతిష్టలనో ఆశించి చేస్తూ ఉంటారు.

సత్వగుణం:

ఇక సత్వగుణ ప్రధానులైనవారు తాము చేసే ప్రతి పనిని ఎంతో శ్రద్ధగా చేస్తారు. కానీ ఏ పనికీ వీరు ప్రతిఫలాన్ని ఆశించరు. శాస్త్రము లేదా గురువులు, పెద్దలు నిర్దేశించిన విధంగా ఆయా కర్మలను తమ కర్తవ్యంగా భావించి నిరంతరాయంగా చేస్తూ ఉంటారు కానీ ఎప్పటికీ దీనివలన నాకేంటి అని కాని, ఫలితంలేని పనులను ఎన్నాళ్ళు చేస్తాం అని కాని ఆలోచించరు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా, నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా, కేవలం భగవంతుడు తమతో చేయిస్తున్నాడనే భావనతో, అత్యంత శ్రద్ధా భక్తులతో తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. అలాగే గురువులు, పెద్దలు చెప్పిన ప్రతి విషయాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆచరణలో పెడతారు.

కనుక మనం ముందుగా తమోగుణాన్ని జయించాలంటే సోమరితనాన్ని వదలిపెట్టి, గురువులను, పెద్దలను ఆశ్రయించి ఏ పని ఎలా చెయ్యాలో శ్రద్ధగా తెలుసుకోవాలి. మా గురుదేవులైతే ఏ వంట ఎలా చెయ్యాలి అన్న దానినుంచి ఏ పదార్థాన్ని ఎలా తినాలి అన్న దానివరకు, మొక్కలు ఎలా పెంచాలి అన్న దానినుండి, పూవులు ఎలా కోయాలి, అవి భగవంతునికి ఎలా అలంకరిచాలి అన్నదాని వరకు ఇలా జీవితంలో ప్రతి విషయంలో ఎలా నడుచుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా అర్థం చేసుకోవాలి - ఇలా ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా నేర్పించేవారు.

ఇలా నేర్చుకున్న విషయాలను ముందుగా ప్రతిఫలమో, పుణ్యమో, పేరు ప్రతిష్టలో ఆశించి అయినా సరే శ్రద్ధగా ఆచరించటం అలవాటు చేసుకోవాలి. ఇలా రజోగుణ సహాయంతో తమోగుణాన్ని జయించవచ్చు. ఇక ఆ తరువాత మనం ఆశించిన ప్రతిఫలమో, పుణ్యమో, పేరు ప్రతిష్టలో మనకు ఎంతవరకు ఆనందాన్ని ఇస్తున్నాయి, ఎంత కాలం నిలిచి ఉంటున్నాయి అని విచారణ చేయటం ద్వారా, వాటి అశాశ్వతత్వాన్ని చక్కగా తెలుసుకోవటం ద్వారా, రజోగుణాన్ని దాటి సత్వగుణ ప్రధానులమై నిష్కామ కర్మాచరణం అలవర్చుకోగలం.

ఇలా కర్తృత్వ భావన లేకుండా, ఎట్టి ఫలితాన్ని ఆశించకుండా కేవలం భగవదాదేశం ప్రకారం కర్మలు చేస్తూ, అవికూడా ఆయనే చేయిస్తున్నాడు తప్ప నేను కేవలం ఒక పనిముట్టునే అనే భావనతో పనులు చేయటం కర్మలో అకర్మ అనబడుతుంది. తద్వారా మనకు ఎట్టి కర్మ ఫలాలు అంటక చివరికి ఈ జన్మ పరంపర నుంచి మోక్షం సిద్ధిస్తుంది.

25, ఫిబ్రవరి 2015, బుధవారం

ప్రకృతి - పురుషుడు

ప్రకృతి రెండు రకాలని భగవద్గీతలోని ఏడవ అధ్యాయంలో గీతాచార్యుడు చెప్పటం జరిగింది. అవి పరాప్రకృతి, అపరాప్రకృతి. ఈ పంచభూతాలు, వాటితో తయారైన కనపడే ప్రపంచమంతా, ఇంకా జీవులలో అంతర్గతంగా ఉండే మనస్సు, బుద్ధి, అహంకారాలు ఇవి అపరాప్రకృతి అని; ఇక ప్రతి జీవిలోనూ కూటస్థ చైతన్య రూపంలో ఉండే ఆత్మవస్తువు పరాప్రకృతి అని చెప్పబడింది.

అలాగే పురుషుడు మూడు రకాలని పదిహేనవ అధ్యాయంలో చెప్పబడింది. నిరంతరం పుడుతూ, పెరుగుతూ, చస్తూ పరిణామం చెందుతూ ఉండే ఈ కనబడే ప్రపంచమంతా క్షరపురుషుడని, ఈ జీవులలో కూటస్థ చైతన్య రూపంలో ఉండి నాశనంలేని ఆత్మవస్తువు అక్షరపురుషుడని చెప్పబడింది. అయితే విశ్వమంతా నిండి ఉండి అవ్యయుడై ఈ లోకాలన్నింటినీ నిర్వహిస్తున్న తాను ఈ ఇద్దరు పురుషులకంటే ఉత్తముడైన పురుషోత్తముడనని గీతాచార్యుడు చెప్పటం జరిగింది.

ఈ విషయాలను మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు ఒక చక్కని తేలికైన ఉదాహరణ ద్వారా వివరించారు. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఒక కుండలో నీరు ఉన్నదనుకోండి, ఆ నీటిలో చంద్రుని ప్రతిబింబం మనకు గోచరిస్తుంది. కుండలోని నీరు ఉన్నంతవరకు చంద్రుడు వేరుగా, ప్రతిబింబం వేరుగా కనిపిస్తాయి. అదే నీరు తీసివేసామనుకోండి, ఆ ప్రతిబింబం చంద్రబింబంలో లయించిపోతుంది.

ఇక్కడ ఆ కుండ మన శరీరం. ఇక నీరేమో మనస్సు. చంద్రుడు పరమాత్మ, నీటిలో కనిపించే చంద్రుని ప్రతిబింబం జీవాత్మ. ఇక్కడ కుండ/శరీరం, నీరు/మనస్సు - అపరాప్రకృతి లేదా క్షర పురుషుడు. అలాగే ప్రతిబింబం/ఆత్మ - పరాప్రకృతి లేదా అక్షర పురుషుడు. ఇక చంద్రుడు/పరమాత్మ - పురుషోత్తముడు. కుండలో నీరున్నంతవరకూ, బింబ ప్రతిబింబాలు వేరువేరుగా కనపడినట్లు, మనకు మనస్సు ఉన్నంతవరకూ జీవాత్మ పరమాత్మలు వేరువేరుగా కనిపిస్తారు. ఎప్పుడైతే ఆ మనస్సు లయం అయిపోతుందో అప్పుడు శరీరం అలాగే ఉన్నా, జీవాత్మ పరమాత్మలో లయించిపోతుంది. అదే జీవన్ముక్త స్థితి. మా గురుదేవులు ఎప్పుడూ చెప్పేవారు - ముక్తి అంటే బ్రతికి ఉన్నప్పుడే అనుభవించాలి కానీ, చచ్చిపోయిన తరువాత ఏమీ ఉండదు, ఎత్తిపోతలే అని.

అయితే ఈ మనస్సు ఎలా లేకుండా పోతుంది అంటే - అసలు మనస్సు అంటే సంకల్పాల సమూహం. మనలో సంకల్పాలు లేకుండా పొతే ఇక మనస్సుకు ఉనికి లేదు. అలా సంకల్పాలు లేకుండా పోవటానికే మనం సాధన చేయాలి. అది ఎలా చేయాలో భగవద్గీతలో అనేక చోట్ల చెప్పబడింది. మరో సందర్భంలో చెప్పుకుందాం.

21, ఫిబ్రవరి 2015, శనివారం

శివునాజ్ఞ లేనిదే

శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా, మరి లోకంలో ఇంతమంది ఇన్ని నేరాలు, ఘోరాలు ఎలా చేయగలుగుతున్నారు? వారందరికీ శివునాజ్ఞ ఉన్నదా? అని చాలామంది మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారిని అడిగేవారు.

ముందుగా మనం జంతువుల విషయం చూస్తే - ఆహారం, నిద్ర, భయం, మైధునం ఇవన్నీ అన్ని జీవులకు సహజసిద్ధమైనవి. ఏ జంతువైనా వేరే జంతువును కానీ, మనిషిని కానీ దాడి చేసి గాయపరచింది అంటే, దానికి కారణం ఈ నాలుగింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది. ఇవి నాలుగూ భగవంతుని వలన జీవులందరికీ ప్రసాదించబడినవి కనుక ఈ విషయంలో ఆయా జీవులు చేసే పనులన్నీ భగవంతుని ఆజ్ఞ ప్రకారమే జరుగుతున్నాయని మనం విశ్వసించవచ్చు. ఇక వరదలు, భూకంపాలు, తుఫానులు మొదలైన ప్రకృతి భీభత్సాలన్నీ భగవంతుడు కల్పించిన ప్రకృతి నియమాలకు లోబడే సంభవిస్తాయి కనుక అవి కూడా భగవంతుని ఆజ్ఞకు లోబడే ఇవన్నీ చేస్తున్నాయని మనం నమ్మవచ్చు.

అయితే భగవంతుడు ఈ ప్రకృతికి, జంతువులకి ఇవ్వని బుద్ధి అనే పరికరాన్ని, విచక్షణా జ్ఞానాన్ని మనుషులకు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన ప్రాణులన్నీ ప్రకృతిగతంగా ప్రవర్తిస్తాయి తప్పితే, తాము చేసే పనుల మంచి చెడ్డలను విచారించి నిర్ణయించుకునే శక్తి వాటికి లేదు. అందుకే అవి శివునాజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తున్నాయని మనం భావించగలం. అయితే మనిషికి విచారించి నిర్ణయించగలిగే బుద్ధిని ఇచ్చిన భగవంతుడు, తద్వారా మరే జీవికీ లేని స్వేచ్ఛను ప్రసాదించాడు. కానీ మనిషి ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తన స్వార్థం కొరకు మతం పేరున, కులం పేరున, ప్రాంతం పేరున, ఇంకా అనేక కుంటిసాకులు చూపి ఇతరులకు హాని కలిగిస్తున్నాడు.

ఇతర జీవులకు లేని స్వేచ్ఛను మనిషికి ఇవ్వటం శివునాజ్ఞయే కానీ, ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మనిషి సాగించే మారణహోమం శివునాజ్ఞ కాదు. మా గురుదేవులు ఇదే చెప్పేవారు. తప్పు చేసే మానవులు తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవటానికి భగవంతుడ్ని అడ్డు పెట్టుకుంటారు కానీ, నిజంగా భగవంతుడే అన్నీ చేయిస్తున్నాడని మనస్పూర్తిగా నమ్మినవారు ఏ తప్పూ చేయలేరని.

18, ఫిబ్రవరి 2015, బుధవారం

తపస్సు - ప్రార్థన

సాధారణంగా మనం తపస్సు అంటే ఏ అడవికో వెళ్ళి, నిద్రాహారాలు మాని, శరీరాన్ని కృశింపచేయాలని అనుకుంటాం. కానీ భగవద్గీతలో 17వ అధ్యాయంలో మనోవాక్కాయములతో చేయగల మూడు విధాలైన తపస్సులను గీతాచార్యుడు మనకు ప్రబోధించాడు. అవేమిటో చూద్దాం.

శరీరంతో చేసే తపస్సు:
దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే || 17.14 ||

దేవతలను, ద్విజులను, గురువులను, జ్ఞానులను పూజించటం, శుచిగా, నిజాయితీగా ఉండటం, బ్రహ్మచర్యాన్ని, అహింసను పాటించటం శరీరంతో చేసే తపస్సు అవుతుంది.

 వాక్కుతో చేసే తపస్సు:
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియ హితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే || 17.15 ||

ఎవరికీ ఉద్వేగం కలిగించని, రెచ్చగొట్టని వాక్కు, అలాగే సత్యంగాను, అవతలివారికి ప్రియాన్ని, హితాన్ని కలిగించేదిగా ఉండే వాక్కు, ఇంకా వేదాధ్యయనం చెయ్యటం ఇవి వాక్కుతో చేసే తపస్సుగా చెప్పబడ్డాయి.

ఇక మనస్సుతో చేసే తపస్సు:
మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః |
భావ సంశుద్ధి రిత్యేతత్తపో మానసముచ్యతే || 17.16 ||

మనస్సును ప్రసన్నంగా ఉంచుకోవటం, ఎప్పుడూ సౌమ్య స్వభావం కలిగిఉండటం, మౌనంగా(లోపల ఏ సంకల్పాలు లేకుండా) ఉండటం, ఆత్మనిగ్రహం కలిగి ఉండటం, మనస్సులో ఎల్లప్పుడూ పరిశుద్ధమైన భావనలే ఉత్పన్నమవటం ఇవి మనస్సుతో చేసే తపస్సుగా చెప్పబడ్డాయి.

ఇదే విధంగా మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు ఈ రకమైన తపస్సులను ఆశ్రమ నిత్య ప్రార్థన రూపంలో తేట తెలుగు పదాలలో అందించారు.

వాక్కుతో చేసే తపస్సు:
సత్య సుందర స్వరూపుడవైన ఓ పరమేశ్వరా! సత్యముగను, పవిత్రముగను, మృదువుగను ఉండు వాక్కును, నిర్మలమగు అంతఃకరణమును మాకు ప్రసాదింపుము.

శరీరంతో చేసే తపస్సు:
అవ్యాజ కరుణామూర్తీ! తను మన ధనములతో సదా ఇతరులకు మంచినే చేయుటకును, ఇతరులయందు మంచినే చూచుటకును, మంచినే గ్రహించుటకును తగిన సద్బుద్ధిని మాకు దయసేయుము.

మనస్సుతో చేసే తపస్సు:
దీనబంధూ! దయానిధే! మా మనస్సు అచంచల విశ్వాసముతో నిరంతరము నీయందే నిలచియుండునట్లు అనుగ్రహింపుము. మాలో భక్తి జ్ఞాన వైరాగ్య బీజములు అంకురించి, పెంపొంది, ఆత్మానంద ఫలమును ఒసగులాగున ఆశీర్వదింపుము.

బుద్ధితో చేసే తపస్సు:
ఓ పరంజ్యోతి స్వరూపా! మార్గ దర్శకుడవై చీకటినుండి వెలుగు లోనికిని, అసత్యమునుండి సత్యవస్తువు కడకును, మృత్యువునుండి అమృతత్వమునకును మమ్ము నడిపింపుము.

ఇలా లోకంలో ప్రతి ఒక్కరూ ఆచరిస్తే ప్రపంచానికి కలిగే ఫలితం:
దేవదేవా! నీ కృపచే మానవునికీ మానవునికీ మధ్య భేదబుద్ధి నశించి, సర్వ జీవులు సమభావముతోనూ, ప్రేమ దృష్టితోనూ మెలగుదురుగాక. లోకములన్నియు శాంతి సౌఖ్యములతో వర్ధిల్లునుగాక.
(ఆధ్యాత్మికతను మించిన సోషలిజం లేదనేవారు మా గురుదేవులు)

ఇక వ్యక్తిగతంగా మనకు కలిగే ఫలితం:
ప్రభూ! అనుక్షణమును, అంత్యకాలమునను నీ స్మరణమే మా జిహ్వయందు నిలచుగాక. నీ రూపమే మా మనస్సునందు నిలచియుండుగాక. ఈ జన్మమే మా కడసారి జన్మమై నీ సాయుజ్యమును పొందించుగాక.

పాహిమాం! పాహిమాం! పాహిమాం! పాహి!!!
హరిః ఓం తత్సత్!


10, ఫిబ్రవరి 2015, మంగళవారం

కల్పవృక్షం నీడలో ఉంటే?

చిన్నప్పుడు చదువుకున్న కథ. బహుశః శ్రీ రామకృష్ణ పరమహంస స్వామి చెప్పినది అనుకుంటా. ముందుగా ఆ కథ చెప్పుకొని, అది నా అనుభవంలోకి ఎలా వచ్చిందో చూద్దాం.

ఒక బాటసారి అడవిలో ఎంతో దూరం నడచి అలసిపోయి ఒక చెట్టు నీడకు చేరాడు. అయితే ఆ చెట్టు కల్పవృక్షమని అతనికి తెలియదు. చాలా ఆకలితో ఉన్నాడేమో, తినడానికి ఏమైనా దొరికితే బాగుండును అనుకున్నాడు. వెంటనే అతని ముందు పంచభక్ష్య పరమాన్నాలతో విందు భోజనం ప్రత్యక్షమయ్యింది. ఆవురావురుమంటూ విందారగించిన అతనికి ఆపుకోలేనంత నిద్ర ముంచుకొచ్చింది. ఇప్పుడు పడుకోవటానికి ఒక మంచం ఉంటే ఎంత బాగుంటుందో అనుకున్నాడు. వెంటనే హంసతూలికా తల్పం ప్రత్యక్షమయింది. దానిమీద విశ్రమించిన అతనికి తన భార్య ప్రక్కన ఉండి కాళ్ళు వత్తుతూ తాంబూలం తినిపిస్తుంటే భలేగా ఉంటుంది కదా అన్న కోరిక కలిగింది. వెంటనే తాంబూలం పళ్ళెంతో అతని భార్య ప్రత్యక్షమయ్యింది. ఇక మన వాడికి ఆలోచన మొదలయ్యింది. ఉన్నట్టుండి ఇంత కారడవిలో ఈ విందు భోజనం, ఈ తల్పం, తన భార్య ప్రత్యక్షమవటం ఏమిటి? కొంపదీసి ఇది ఏదో భూతం కాదు కదా? అనుకున్నాడు. వెంటనే ఆ భార్య భూతంలా మారిపోయింది. అమ్మో ఇది నన్ను మ్రింగేస్తుందేమో అని భయపడ్డాడు. వెంటనే ఆ భూతం అతనిని మ్రింగివేసింది.

నేను కూడా ఎన్నో జన్మలనుంచి ఈ సంసారమనే అరణ్యంలో పరిభ్రమిస్తూ చివరికి మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ అనే కల్పవృక్షం నీడకు చేరాను. 2003లో మా ఆశ్రమంలో సహస్ర చండీ యాగం జరుగుతున్న రోజులలో, అమెరికానుండి వచ్చి, కర్తలుగా యాగంలో సేవ చేసుకుంటున్న భక్తులను చూసి, "ఆహా! నేను కూడా అమెరికా వెళ్ళి బాగా డబ్బులు సంపాదిస్తే ఇలాగే సేవ చేసుకోవచ్చు కదా" అన్న ఆలోచన నాకు కలిగింది. (చాలా డబ్బులు కావాలని తపస్సు చేసినవాడు తీరా శివుడు ప్రత్యక్షమైతే మా మేనమామ చెవులనిండా వెంట్రుకలు మొలిపించమని వరం కోరుకున్నట్లే ఉంటాయి మన తెలివితేటలు. మనకు ఏది కావాలో అది డైరెక్టుగా కోరుకోకుండా ఇలా డొంకతిరుగుడు వ్యవహారాలన్నీ చేస్తాం.) ఆ మర్నాడే "అమెరికా వెళ్ళాలి, వెంటనే బయలుదేరి రమ్మని" మా ఆఫీసునుండి ఫోను వచ్చింది. హాయిగా ఇంత మహత్తర యాగాన్ని దర్శించి ఆనందిస్తూ ఉంటే మధ్యలో ఈ విఘ్నం ఏమిటని తిట్టుకున్నాను కానీ, అది నా కోరిక వల్లనే వచ్చినదని అప్పుడు గుర్తించలేకపోయాను. ఈ డొంకతిరుగుడు వ్యవహారంతో కొసరు కోరిక వెంటనే తీరినా, అసలు కోరిక తీరటానికి మరో పదేళ్ళు పట్టింది.

అలాగే 2005లో ఒకసారి ఎయిర్ఇండియా విమానంలో ప్రయాణిస్తూ, "మన దేశపు విమానంలో ప్రయాణం బాగానే ఉంది కాని, మనం రెండు వందల ఏళ్ళపాటు బ్రిటీషువారికి దాశ్యం చేశాము కదా, ఒకసారి ఆ బ్రిటిష్ ఎయిర్వేస్ విమానం ఎక్కి వాళ్లతో సేవలు చేయించుకుంటే ఎలా ఉంటుంది?" అన్న ఆలోచన కలిగింది. నెల తిరక్కుండా మా ఆఫీసువాళ్ళు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో నన్ను అమెరికా పంపించారు. అప్పుడు మొదటిసారి నాకు భయం వేసింది. "అమ్మో! ఇలా అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటే చాలా ప్రమాదం సుమా! ఇకనుంచి కోరికలను అదుపులో పెట్టుకోవాలి" అనుకున్నాను.

అయితే పైన చెప్పుకున్న కథలో మనం చూస్తే, కల్పవృక్షం నీడలో ఉన్నవారు తమ కోరికలనే కాక ఆలోచనలను, భయాలను, సందేహాలను అన్నింటినీ అదుపులో పెట్టుకోవాలి. అలాంటి కనువిప్పు కలిగించే సంఘటన 2013 సెప్టెంబర్లో జరిగింది. మన దేశంలోని హోటళ్ళలో "ప్లేటులో చేతులు కడుగరాదు" అన్న బోర్డులు ఎంత సహజమో, అమెరికాలోని హోటళ్ళలో తినే పదార్థాలు గొంతుకు అడ్డం పడితే ఏమి చెయ్యాలో సూచించే బోర్డులు అంత సహజంగా ఉంటాయి. ఒకరోజు ఆఫీసునుండి ఇంటికి వస్తూ బస్సులో ఉండగా ఈ బోర్డు గుర్తుకు వచ్చి, "ఈ అమెరికా వాళ్ళు అన్నింటికీ అతిగా భయపడతారు. మన దేశంలో ఆహారం గొంతుకు అడ్డంపడి చనిపోయినవాడ్నిఒక్కడ్ని కూడా చూడలేదు. అంత చిన్న విషయాన్ని వీళ్ళు ఇంత పెద్దదిగా చేస్తున్నారు" అని నవ్వుకున్నాను. రెండు మూడు రోజుల తరువాత, ఒక రాత్రి అలవాటు ప్రకారం విటమిన్ మాత్ర వేసుకొని, నీళ్ళు త్రాగేలోపు ఆ మాత్ర గొంతులో అడ్డం తిరిగింది. అసలు నీళ్ళు మ్రింగటానికి కూడా అవకాశం లేదు. క్షణాలలో శ్వాస అందటం ఆగిపోయింది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఎంత ప్రయత్నించినా ఆ మాత్ర లోపలికి వెళ్ళదు, బయటికి రాదు. శ్వాస ఆడకపోవటంతో మెల్లగా స్పృహ తప్పుతోంది. "ఈ జీవితానికి అంతం ఇలా నిర్ణయించారా ప్రభూ" అని ఒక్కసారి శ్రీగురుదేవులను తలచుకొని ఇక అన్ని ప్రయత్నాలను విరమించి ప్రశాంతంగా మరణించటానికి సిద్ధపడ్డాను. అప్పుడు, "అంత తేలిగ్గా చేతులెత్తేస్తే ఎలా? బ్రతకడానికి ప్రయత్నించు" అన్న అంతర్వాణి వినిపించడం, ఇందాక చెప్పుకున్న హోటల్లోని బోర్డుపై ఉండే సూచనలు గుర్తుకురావడం ఒకేసారి జరిగాయి. వెంటనే మళ్ళీ స్పృహ వచ్చింది. అప్పుడు బాగా ముందుకు వంగి పొట్టమీద చేతులతో నొక్కుకుంటే ఆ మాత్ర బయటపడింది.

ఇలా పైన చెప్పుకున్న కధలోని కల్పవృక్షం వలె శ్రీగురుదేవులు సాక్షీమాత్రంగా ఉంటూ మా అందరి జీవితాలను నడిపిస్తున్నారు. అయితే, తాను కల్పవృక్షం నీడలో ఉన్నానన్న విషయాన్ని గ్రహించని ఆ బాటసారి మొదట్లో ఆనందాన్ని పొందినా, తరువాత నాశనం అయిపోయాడు. కానీ ఆ విషయాన్ని గుర్తించినవారు సదా మంచినే కోరుకుంటూ, మంచి ఆలోచనలే చేస్తూ, మంచినే చూస్తూ తమ జీవితాన్ని సరిదిద్దుకో గలుగుతారు. మా ఆశ్రమ ప్రార్థనలోని సారాంశం ఇదే. ఈ విషయాన్ని ఎప్పుడైనా మరచిపోయి తప్పుడు ఆలోచనలు చేసినా, శ్రీగురుదేవులు దయామయులై మనకు బుద్ధి తెప్పించి మళ్ళీ మంచి మార్గానికి మరలుస్తారు.



5, ఫిబ్రవరి 2015, గురువారం

కామ దహనం

నాకు చాలా కాలం ఒక విషయం అర్థం అయ్యేది కాదు. తారకాసురుడు లోకలన్నింటినీ పీడిస్తూ ఉంటే లోక రక్షణార్థం పార్వతీపరమేశ్వరులను కలపడానికి ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి ఎందుకు భస్మం కావలసి వచ్చింది అని. ఒకవేళ మన్మధుని గర్వభంగం కోసమని అనుకుంటే, శివుడు మన్మధుని బాణాలకు లొంగకుండా ఉంటే దానితోనే గర్వభంగం అయిపోయేది కదా.

ఇక్కడ మనం మన్మధుడు నెరవేర్చాలనుకున్నశివ పార్వతుల కళ్యాణం ఎలా జరిగిందో చూద్దాం. మన్మధుని బాణాలచే పీడింపబడి కూడా పరమేశ్వరుడు చక్కగా అలంకరించుకొని, రూప లావణ్యాలతో అలరారుతున్న పార్వతీదేవిని కన్నెత్తి చూడలేదు. అప్పుడు ఆ జగన్మాత కఠోర తపోదీక్షను పూని కొంతకాలం ఆకులు మాత్రమే తీసుకుంటూ, తరువాత వాటిని కూడా మానివేసి, మరికొంత కాలానికి శ్వాసను కూడా బంధించి తపమాచరించింది. ఇలా చిక్కి శల్యావశిష్టయై ఉన్న ఆ తల్లిని, అప్పుడు కూడా ఇంకా కఠినమైన తన పరీక్షకు గురిచేసి, ఆమె మనోనిగ్రహాన్ని, తనపై గల ప్రేమను నిర్ధారించుకున్నాకనే పరమేశ్వరుడు పార్వతీమాతను పరిణయమాడాడు.

మరి అంతటి కఠోర సాధనతో, పరీక్షలకు తట్టుకుని, సంపూర్ణ శరణాగతితో, సర్వ సమర్పణ భావనతో పొందవలసిన పరమేశ్వరుని ప్రేమను, ఆయనలో కామ వాంఛలను రెచ్చగొట్టడం ద్వారా పొందింపచేయాలనుకోవటమే మన్మధుడు చేసిన పెద్ద తప్పు.

2, ఫిబ్రవరి 2015, సోమవారం

బెడ్రూంలో భగవంతుడు

చాలా మందికి బెడ్రూంలో దేవుడి ఫోటో పెట్టుకోకూడదని ఒక అపోహ ఉంటుంది. మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం ప్రతి మానవుడు సాధించవలసిన పురుషార్థాలలో కామం కూడా ఒకటి. అర్థం, కామం రెండూ ధర్మానికి బద్ధమై ఉన్నప్పుడు అవి మోక్షానికి దారితీస్తాయి. కనుక ధర్మబద్ధంగా ఒక్కటైన భార్యాభర్తలు చేసే సంసారం పూర్తిగా ధర్మ సమ్మతమైనది, పుణ్య ప్రదమైనది. అందులో పాపానికి తావు లేదు.

ఇక మనం దేవుని ఫోటో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, మన పడకగదితో సహా ఈ సృష్టిలోని అణువణువులో ఆ భగవంతుడు నిండే ఉన్నాడు. ఆయన చూడలేనిది, కొత్తగా చూసేది ఏదీ లేదు. అలాగే అయన చూడటమంటే అది ఏదో పరాయివారి పడక గదిలోకి తొంగి చూసినట్లు కాదు. అద్దంలో మనని మనం చూసుకున్నట్లే ఆయన మనని చూస్తాడు. ఎందుకంటే మనందరం ఆయన ప్రతిరూపాలమే.

ఈ విషయం ఎవరైనా సమర్థులైన సద్గురువులతో, అవతార పురుషులతో సన్నిహితంగా మెలగినవారికి తప్పకుండా అనుభవంలోకి వచ్చి ఉంటుంది. ఒకసారి మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు భగవన్నామాన్ని సర్వకాల సర్వావస్థలయందు జపించవచ్చు అని బోధిస్తున్నప్పుడు ఒక పండితుడు ఇలాగే భగవన్నామం చాలా పవిత్రమైనది, దానిని ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ జపించకూడదు అని వాదించాడు. ఆ మర్నాడు అతనికి అనేక విరేచనాలు అయ్యి, కళ్ళలోకి ప్రాణాలు వచ్చి, చివరికి బాత్రూములో భగవంతుడ్ని తలుచుకోక తప్పలేదు.

నిజానికి పడకగదిలో దేవుడి ఫోటో పెట్టుకుని ప్రతిరోజూ నిద్రపోయే ముందు ఆయనను చూడటం, అలాగే కళ్ళు తెరవగానే మళ్ళీ ఆయనను చూడటం అందరూ నేర్చుకోవలసిన ఒక మంచి అలవాటు.

29, జనవరి 2015, గురువారం

పూర్ణమదః పూర్ణమిదం

ఓం పూర్ణమదః పూర్ణమిదం పుర్ణాత్పూర్ణముదచ్యతే |
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ||

మాములుగా ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చుస్తే "అది పూర్ణం, ఇది పూర్ణం. పూర్ణంనుండి పూర్ణం ఉద్భవిస్తుంది. పూర్ణంనుండి పూర్ణం తీసివేసినా పూర్ణమే మిగులుతుంది." ఇది భగవంతుని పూర్ణ తత్వాన్ని చెప్పే శ్లోకం. భగవంతుని నుండి ఈ ప్రపంచమంతా ఉద్భవించినా ఆయనయొక్క పూర్ణత్వానికి ఏ లోటు లేదని చెపుతుంది. కానీ ఈ శ్లోకం మామూలు మన బుద్ధులకు అర్థం చేసుకోవటం కష్టం.

అందుకే మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు ఈ శ్లోకానికి రెండు చక్కని ఉదాహరణలు చెప్పేవారు.

ఒక దీపం ఉందనుకోండి. ఆ దీపంనుండి ఎన్ని దీపాలైనా వెలిగించుకోవచ్చు. ఒక దీపం నుండి ఇలా వెలిగించబడిన మిగిలిన దీపాలు కూడా అంతే కాంతిని కలిగిఉంటాయి. కానీ ఇలా ఎన్ని దీపాలు వెలిగించినా మొదటి దీపానికి వచ్చే లోపం ఏదీ లేదు. అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది.

అలాగే మనం ఒక అక్షరం చక్కగా నేర్చుకున్నామనుకోండి, ఆ అక్షరాన్ని మనం ఎంతమందికైనా నేర్పించవచ్చు. అలాగే ఆ అక్షరాన్ని మనం ఎన్నిసార్లైనా వాక్కు ద్వారా, వ్రాత ద్వారా ఉపయోగించవచ్చు. కానీ మనలో ఇమిడిపోయిన ఆ అక్షరానికి ఎటువంటి లోటు రాదు. అది ఎప్పుడూ పూర్ణంగానే మనలో నిలిచి ఉంటుంది.

ఇలాంటిదే మనం లెక్కలలో infinityని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

28, జనవరి 2015, బుధవారం

సుఖంలో రకాలు

మనం అనుభవించే సుఖాలు మూడు రకాలని భగవద్గీతలో 18వ అధ్యాయం 37 నుంచి 39వ శ్లోకం దాకా చెప్పబడింది.

ముందుగా సాత్విక సుఖం:
యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం |
తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మ బుద్ధి ప్రసాదజం ||

మన బుద్ధిని ఆత్మయందు నిలిపి ఉంచి ప్రసన్నమైన మనస్సుతో చేసే సత్కర్మలు ఆచరించబడేటప్పుడు కష్టంగా తోచినా వాటి ఫలం మాత్రం మనకు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఇట్టి సుఖాన్ని సాత్విక సుఖం అన్నారు. ఉదాహరణకు మనకు తెల్లవారు ఝామున లేచి ధ్యానం చేసుకోవాలన్నా, ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసుకోవాలన్నా, ప్రతి రోజూ దేవాలయానికి వెళ్ళాలన్నా, మనకున్న దాంట్లో కొంత దానం చెయ్యాలన్నా కష్టంగానే ఉంటుంది. కానీ కష్టపడి ఈ సత్కర్మలను చేయటం ద్వారా మనకు లభించే సుఖం మాత్రం శాశ్వతంగా నిలచిపోతుంది. మనకు అమృతత్త్వాన్ని ప్రసాదిస్తుంది.

మరి రాజస సుఖం:
విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం |
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం ||

మన ఇంద్రియాలను విషయాల వెంట పరుగులు పెట్టించి వాటి ద్వారా మనం పొందే సుఖం ముందు అమృతప్రాయంగానే కనిపిస్తుంది కానీ అది ఒక పరిమితికి మించి అనుభవిస్తే విషతుల్యం అవుతుంది. దీనికి మా గురుదేవులు చక్కని ఉదాహరణ చెప్పేవారు. నీకు గారెలు ఇష్టం అనుకో, ఒక పరిమితికి లోబడి తింటే ఆనందంగానే ఉంటుంది. అదే చాలా ఇష్టం కదా అని ఒక నక్షత్రమాల(27) లాగించావనుకో ముందు కడుపులో ఉరుములు, మెరుపులు మొదలవుతాయి. తరువాత కుండపోతగా వర్షం పడుతుంది. ఇంటివారు ఘొల్లుమంటారు, డాక్టరు సంచీ ఘల్లుమంటుంది.

ఇక మూడవది తామస సుఖం:
యదగ్రే చానుబంధేచ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్య ప్రమాదోత్ధం తత్తామాసముదాహృతం ||

నిద్ర, సోమరితనము, ప్రమాదము (మనం చేసే పనులలో, ఆలోచనలలో జాగరూకత లేకుండా మనం ఏమి చేస్తున్నామో మనకే తెలియకుండా ఉండటాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ప్రమాదం అంటారు) వలన అనుభవించేటప్పుడు, ఆ తరువాత కూడా విషతుల్యం అయినప్పటికీ అమృతమయమని మనను భ్రమింపచేసే సుఖం తామస సుఖమని చెప్పబడింది. ఈ తామస సుఖానికి కూడా మా గురుదేవులు రెండు చక్కని ఉదాహరణలు చెప్పేవారు. ఒంటె ముళ్ళకంపను తింటుంది. అలాగే కుక్క ఎండిపోయిన ఎముకను కొరుకుతూ ఉంటుంది. ఈ రెండు ఉదాహరణలలో కూడా వాటికి తినే పదార్ధం నుండి వచ్చే సారం ఏదీ లేదు. కానీ ఆ ముళ్ళు/ఎముక వాటి నోటిలో గ్రుచ్చుకొని వాటి రక్తం కారుతూ ఉంటే ఆ రక్తం ఆ ముళ్ళకంప/ఎముక నుండే వస్తోందన్న భ్రమలో అవి వాటిని తింటూ ఉంటాయి. ఇక్కడ తినేటప్పుడు కానీ, ఆ తరువాత కానీ వాటికి ఏమాత్రం సుఖం లభించటం లేదు సరికదా అవి దుఃఖమునే పొందుతున్నాయి. కానీ ఏదో సుఖాన్ని పొందుతున్నామనే భ్రమలోనే ఉంటున్నాయి.

22, జనవరి 2015, గురువారం

సగుణం – నిర్గుణం

భగవంతుడు సాకారుడా? నిరాకారుడా? అని అనేకమంది చర్చించుకుంటూ ఉంటారు. ఆయనను సగుణంగా విగ్రహ రూపంలో పుజించాలా? లేక నిర్గుణంగా ఆరాధించాలా అని కూడా ఈ మధ్యన తరచూ చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల వస్తున్న కొన్ని సినిమాలు కూడా ఈ చర్చకు కారణమనుకోండి.

అయితే ఇలా చర్చించే వారు, ఈ విషయంపై వాదించి, వీలైతే బలవంతంగానైనా/హింసతోనైనా అవతలవారిని తమ మార్గంలోకి తెచ్చుకోవాలని అనుకునేవారు కొన్ని విషయాలు మరచిపోతున్నారు.

ముందుగా – భగవంతుడు సర్వ శక్తిమంతుడు అని అన్ని మతాలు బోధిస్తున్నాయి, ఆస్తికులందరూ ఒప్పుకుంటున్నారు. మరి సర్వ శక్తిమంతుడు అయినవాడికి సాకారంగానో, నిరాకారంగానో ఉండే శక్తి లేదంటారా? ఆయనకు ఆ మాత్రం స్వతంత్రం కూడా ఈ భక్తులు ఇవ్వరా? నిజానికి సగుణానికి, నిర్గుణానికి భేదం లేదు. ఘనీభవించిన మంచుగడ్డ, ప్రవహించే నీరు, గాలిలో తేలిపోయే ఆవిరి అన్నీ ఒకే పదార్థంయొక్క భిన్న రూపాలు కదా?

ఇక అర్చనా విధానాల దగ్గరకు వద్దాం. భగవంతుడే ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించాడని అన్ని మతాల వారు ఒప్పుకుంటారు. అంటే మనందరం ఆయన సంతానమే కదా. ఒక తండ్రికి పదిమంది పిల్లలు ఉన్నారనుకోండి, వారందరికీ తమ తండ్రిని సేవించుకోవాలనే సద్బుద్ధి పుట్టింది. ఇప్పుడు వారందరూ తలో రకమైన సేవ చేసుకుంటే ఆ తండ్రి ఎక్కువ సంతోషిస్తాడా? లేక అందరూ ఒకే విధంగా సేవించుకుంటాం అంటే ఎక్కువ సంతోషిస్తాడా? ఒకరు వంట చేసి, ఇంకొకరు ప్రేమగా తినిపించి, ఒకరు కాళ్ళు పట్టి, ఇంకొకరు కొత్త బట్టలు కొని ఇచ్చి, ఇలా అందరూ కలిసి ఆయనకు అవసరమైన సేవలన్నీ చేసుకుంటేనే ఆయన ఎక్కువ సంతోషిస్తాడు కదా?

గట్టిగా 70 – 80 ఏళ్ళు జీవించని మనమే పూటకో రకమైన తిండి, బట్ట, వినోదం, వ్యాపకం కావాలనుకుంటున్నామే? ఒకే రకమైనవి లభిస్తే బోరు కొట్టిందని విసుక్కుంటున్నామే? మరి ఎన్నో కోట్ల సంవత్సరాలనుంచీ ఉంటూ ఇక ఎప్పటికీ అలాగే ఉండే భగవంతుడు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటూ, ఒకే విధమైన పూజలు అందుకోవాలని శాసించే వారిని ఏమనాలి?


అందుకే మన భారతీయ సనాతన ధర్మం భగవంతుని వివిధ రూపాలలో(ఇందులో అరూపం కూడా భాగమే), వివిధ నామాలతో, వివిధమైన అర్చనా విధానాలతో సేవించుకొనే అవకాశం కల్పించింది. తన పేరు చెప్పి కొట్టుకునే కొడుకులకన్నా, కనీసం తనకోసమైనా కలసి ఉండే కొడుకులను చూసే ఏ తండ్రైనా సంతోషిస్తాడు. మనందరికీ తండ్రి అయిన భగవంతుడికి ఈ పాటి చిన్న సంతోషాన్ని కలిగిద్దాం. 

21, జనవరి 2015, బుధవారం

త్రిగుణాలు

త్రిగుణాల గురించి మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు అనేక ఉపమానాలు చెప్పేవారు. అందులో కొన్ని:
1) ఒక చీకటి గదిలో ఒక దీపం ఉంది. కానీ దానిమీద మూడు మూకుళ్ళు ఉన్నాయి. అందువలన ఆ దీపం వెలుగు ప్రసరించక గదంతా చీకటిగా ఉంది. ముందుగా పైనున్న ఇనుప మూకుడును పగులగొడితే లోపలనున్న చిల్లుల మూకుడు నుంచి కొద్ది కొద్దిగా వెలుగు ప్రసరించి గదిలో ఉన్న వస్తువులు తెలుస్తాయి. ఆ చిల్లుల మూకుడును కూడా పగులగొడితే లోపలనున్న గాజు మూకుడు నుండి దీపం కాంతి స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఈ గాజు మూకుడు కూడా కొంత కాలానికి మసిబారే అవకాశం ఉంది. కనుక ఆ మూకుడును కూడా తొలగించుకుంటే శాశ్వతంగా దీప కాంతిని అనుభవించవచ్చు. ఇందులో ఇనుప మూకుడు తమోగుణం. చిల్లుల మూకుడు రజోగుణం. గాజు మూకుడు సత్వగుణం. ఈ మూడు గుణాలు మనలోనే ఉన్న జ్ఞానజ్యోతిని దర్శించటానికి పైన చెప్పిన ఉదాహరణలోవలె మనకు అడ్డు పడుతున్నాయి.

2) తెల్లని కాంతిని మూడు పలకలు గల గాజు పట్టకం(prism)లోనుండి ప్రసరింప చేస్తే ఆ తెల్లని కాంతి విక్షేపం చెంది ఏడు రంగులలో మనకు కనిపిస్తుంది. అలాగే ఒక్కడే అయిన పరమాత్మ మూడు గుణాలతో కూడిన మన మనస్సులకు ఇన్ని విభిన్న రూపాలలో, లక్షణాలతో ప్రకృతిగా కనిపిస్తున్నాడు. ఈ మూడు గుణాలను తొలగించుకుంటే సర్వత్రా ఒక్క పరమాత్మనే దర్శించ గలుగుతాం.

3) మూడు రెక్కలు గల ఫ్యాన్ ఆగి ఉన్నప్పుడు రెక్కలు మూడు విడి విడిగా కనిపిస్తాయి. అదే ఫ్యాన్ వేగంగా తిరిగినప్పుడు మూడు రెక్కలు మాయమై ఒక్కటే ఆకారం కనిపిస్తుంది. అలాగే భగవన్నామాన్ని వేగంగా (అంటే మధ్యలో విషయాలేవీ అడ్డు రాకుండా) జపించినప్పుడు ఈ మూడు గుణాలు మాయమై ఏకవస్తు దర్శనం అవుతుంది.

4) ఆధ్యాత్మిక సాధనలో మనం ముందుగా రజోగుణాన్ని (అంటే దానిలో భాగమైన పట్టుదల, ఏదైనా సాధించగలననే ఆత్మ విశ్వాసం మొదలైనవి) ఉపయోగించుకొని తమోగుణాన్ని(అంటే బద్ధకాన్ని, సోమరితనాన్ని) జయించాలి. ఆ తరువాత సత్వగుణాన్ని ఉపయోగించుకొని రజోగుణాన్ని కూడా జయించాలి. ఇక చివరిగా సత్వగుణాన్ని కూడా జయిస్తేనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.

5) రజో, తమో గుణాలు ఇనుప, ఉక్కు సంకెళ్ళ లాంటివైతే సత్వగుణం బంగారు సంకెల లాంటిది. ఏ సంకెల అయినా మనను బంధించేదే.

18, జనవరి 2015, ఆదివారం

గడ్డపార మింగితే

ముందుగా ఇంత చక్కని అన్నమయ్య కీర్తనను పరిచయం చేసిన శ్రీ ఎనగంటి రవి చంద్ర గారికి నా కృతజ్ఞతలు.

ఈ పాట యొక్క పూర్తి సాహిత్యం కోసం ఇక్కడ చుడండి.

ఈ పాట యొక్క అర్థాన్ని నాకు అవగాహన అయినంతవరకు వివరిస్తాను.

గడ్డపార (గునపం) యొక్క ముఖ్య ఉపయోగం దానితో నేలను త్రవ్వి మొక్కలు నాటుకోగలగటం. ఆ మొక్కలకు కాసిన పండ్లుగాని, కూరగాయలుగాని మన ఆకలిని తీరుస్తాయి. అంతేకాని ఆ గునపాన్ని మింగేస్తే మన ఆకలి తీరదు కదా. అలాగే మన సంసార బంధానికి కారణమైన మనస్సును, ఇంద్రియాలను పరమాత్మవైపుకు మరల్చుకోవాలి కానీ సంసారాన్ని వదలివేస్తానంటే అది మనను మళ్ళీ అంతకంటే తీవ్రంగా కమ్ముకుంటుంది.

స్వేచ్ఛగా ఆకాశంలో తిరిగే చిలకలను తెచ్చి బండికి కట్టి లాగమంటే అవి లొంగకపోగా బండిని కూడా ఆకాశంలోకి ఎగరేసుకు పోవటానికి ప్రయత్నిస్తాయి. అలాగే ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించుకుంటే అవి సమయం కోసం పొంచి ఉండి మనను ఘోరంగా దెబ్బ తీస్తాయి.

మండే అగ్నిని తెచ్చి మసి గుడ్డలో మూటకట్టి ఇంట్లో పెట్టుకుందామంటే అది దాగి ఉండకపోగా ఇల్లంతా తగలబెట్టేస్తుంది. అలాగే మమకారాన్ని బలవంతంగా దాచి ఉంచుదామంటే అది మనలనే బానిసగా చేసుకుని ఆశలలో పడవేస్తుంది.

అలాగే విష సర్పాన్ని తెచ్చి దిండుకింద పెట్టుకొని అణగి ఉండమంటే అది మననే కాటు వేస్తుంది. అందువల్ల ఈ సంసారాన్ని నిగ్రహించాలంటే మనవల్ల కాదు. అది కేవలం శ్రీవేంకటేశ్వరునియందు భక్తితోనే సాధ్యం.

ఇదే విషయాన్ని మా గురుదేవులైన శ్రీబాబూజీ మహారాజ్ వారు ఇలా చెప్పేవారు - ఇంద్రియాలు, మనస్సు స్ప్రింగ్ వంటివి. బలవంతంగా అణచి పెట్టాలని చుస్తే అదను చూసి అంతకంటే బలంగా ఎదురు తిరుగుతాయి. ఈ మనస్సు, శరీరము మనకు శత్రువులు కావు. పరమార్థ సాధనకు ఎంతో ఉపయోగపడే సాధనాలు(శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం). అశాశ్వతమైన క్షణిక సుఖాల కోసం పరుగులు పెట్టే వీటికి శాశ్వతమైన పరమాత్మ వస్తువునందు మెల్లమెల్లగా ఆసక్తిని కలిగించాలి. ఒకసారి రుచి మరిగిన తరువాత వాటంతట అవే సంసారాన్ని వదిలివేస్తాయి.

ఇదే విషయాన్ని భగవద్గీతలో గీతాచార్యుడు అనేక పర్యాయాలు చెప్పటం జరిగింది(ప్రకృతిం యాన్తి భూతాని నిగ్రహః కిం కరిష్యతి......., మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి....., ఇలా). ఇంకా త్యాగరాజ స్వామివారు కూడా "మనసా ఎటులోర్తునే? నా మనవిని చేకొనవే" అని తన మనస్సును బ్రతిమాలుకున్నారు. అలా కాదని పట్టుదలకు పోయి తపస్సు చేసిన విశ్వామిత్ర మహర్షి అనేక పర్యాయాలు తన మనస్సుకు, ఇంద్రియాలకు లొంగిపోయిన చరిత్ర మనకు తెలుసు. అలాగే ఎంతో పట్టుదలతో తపస్సులు చేసిన రాక్షసులందరూ తమ తపస్సులు ఫలించగానే మళ్ళీ మనస్సుకు, ఇంద్రియాలకు లొంగిపోయారు.

కనుక మనం ప్రహ్లాదుడు(కంజాక్షునకుగాని కాయంబు కాయమే........, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు... మొదలైన పద్యాల ద్వారా), కులశేఖరాళ్వార్(జిహ్వే కీర్తయ కేశవం... మొదలైన శ్లోకాల ద్వారా) మొదలైన మహా భక్తులు చూపిన బాటలో మెల్లమెల్లగా మన మనస్సును, ఇంద్రియాలను పరమాత్మ వైపుకు త్రిప్పుకోవాలి.

17, జనవరి 2015, శనివారం

వాడల వాడల వెంట

అన్నమయ్య కీర్తనలలో "వాడల వాడల వెంట వాడవో నీడనుండి చీరలమ్మే నేత బేహారి" అనే కీర్తన చాలా బాగుంటుంది.

ఇందులో అన్నమయ్య పరమాత్ముని ఒక చీరలు నేసే నేతవానిగా, ఇంకా వాటిని అమ్మే వ్యాపారిగా కీర్తిస్తారు.

పంచభూతములనే నూలుతో మన దేహలనే చీరలు తయారవుతాయి. ఈ నూలు దారాలు స్థిరంగా నిలబడటానికి మాయ అనే గంజి కలిపి ఈ చీరలను నేస్తారు. ఇంకా ఆ చీరాల మీద ఉండే పలు రకాల రంగు రంగుల డిజైన్ల కోసం స్వామి గుణములనే నూలును వాడుతారట.

అయితే సంతలో ఈ చీరలను కొనుక్కునే జీవులకి ఒకేసారి అనేక చీరలు కొనుక్కుని బీరువాలో దాచుకొనే సౌలభ్యం లేదు. తన దగ్గరున్న చీరను (దేహాన్ని) స్వామికి ఇచ్చేసి, ఇంకా తన కర్మ అనే ధనాన్ని వెచ్చించి దానికి అనుగుణమైన కొత్త చీరను (దేహాన్ని) స్వామి నుండి కొనుక్కోవాలి. అందుకే స్వామిని అన్నమయ్య మారు బేహారి అంటారు.

అయితే మరి స్వామి వ్యాపారం ఎప్పుడు బాగా గిట్టుబాటు అయినట్టు? ఆ ఊరిలోని జీవులందరికీ ఇక చీరలు కొనే అవసరం ఎప్పుడు కలుగకుండా పోతుందో (అంటే మళ్ళీ జన్మించవలసిన అవసరం లేకుండా పోతుందో) అప్పుడు. అందుకే అన్నమయ్య స్వామిని నీడపట్టున (వైకుంఠంలో) కూర్చోకుండా వాడల వాడల వెంట తిరుగుతూ (గురువుల, మహాత్ముల రూపంలో మాటిమాటికీ అవతరిస్తూ) వ్యాపారం చేసుకోమని (జీవులందరినీ ఇక శరీరం ధరించే అవసరం లేని మోక్ష స్థితికి చేర్చుకోమని) సూచిస్తున్నారు.

16, జనవరి 2015, శుక్రవారం

సంక్రాంతి - తుమ్మెద

నిన్న సంక్రాంతి సందర్భంగా ఏ తెలుగు టీవీ ఛానెల్ పెట్టినా ఒకటే పాట - సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా - అంటూ. అసలు సంక్రాంతికి, తుమ్మెదకు ఉన్న ఈ లింకేంటో నాకు అర్థం కాలేదు. అసలు తుమ్మెద లేని సంక్రాంతి పాటలే లేవా?